17న మరో విమెన్ టాప్ బ్రాండింగ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: పూర్తి వివరాలివే..
ముంబై: మహిళా లోకానికి సంబంధించిన మరో టాప్ బ్రాండింగ్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయనుంది. 1,013.60 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. మహిళలకు సంబంధించిన ప్రొడక్ట్ను మార్కెటింగ్ చేసే సంస్థ కావడం వల్ల మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా తరహాలో దీని డెబ్యూ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.
ఏమిటా కంపెనీ..
ఆ కంపెనీ- గో ఫ్యాషన్. ఇదివరకు గో కలర్స్ పేరుతో మార్కెట్లో చిరపరిచితమైన పేరు. అనంతరం ఇది గో ఫ్యాషన్గా పేరు మార్చుకుంది. మహిళలు ధరించే బాటమ్ వేర్ను ప్రమోట్ చేసే సంస్థ ఇది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా షోరూమ్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్.. మల్లీ పెక్స్.. ఇలా అన్ని చోట్లా ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. 1,013 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఐపీఓ జారీ ఎప్పుడు?
ఈ నెల 17వ తేదీన దీనికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూ జారీ అవుతుంది. 22వ తేదీన ముగుస్తుంది. గో ఫ్యాషన్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ను 655 రూపాయల నుంచి 690 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఆసక్తి ఉన్నా వారు కనీసం 21 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 14,490 రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 21 షేర్లను ఒక లాట్గా నిర్ధారించారు. గరిష్ఠంగా 13 లాట్స్ను రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు.
క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల వాటా ఎంత..?
ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా 75గా నిర్ధారించింది గో ఫ్యాషన్ కంపెనీ యాజమాన్యం. 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 10 శాతాన్ని రిటైల్ మదుపర్ల కోసం కేటాయించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని దేశంలో 120 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్ లెట్లను నెలకొల్పడానికి, వర్కింగ్ కేపిటల్స్, కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపింది. ఈ మేరకు దీనికి సంబంధించిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను ఇదివరకు సెబీకి సమర్పించింది.
8 శాతం మార్కెట్ వాటా..
కాగా- మహిళల బ్రాండెడ్ బాటమ్ వేర్ సెగ్మెంట్లో గో ఫ్యాషన్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది. దీన్ని మరింత విస్తరించుకోవాలనేది కంపెనీ లక్ష్యంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్.. ఈ పబ్లిక్ ఇష్యూను ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. మహిళలకు సంబంధించిన ప్రొడక్ట్ కావడం వల్ల ఈ ఐపీఓపై భారీ అంచనాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.