జీఎంఆర్ నిధుల వేట, ఆంధ్రప్రదేశ్ భూములు సహా అప్రదాన ఆస్తుల విక్రయం!
తన ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు వెలుపల ఉన్న ఆస్తుల్ని విక్రయించాలని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భావిస్తోంది. భూమితో పాటు అప్రాధాన్య ఆస్తుల్లో వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని చూస్తోంది. యాభై శాతం భూములు విక్రయించినా పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, వీటితో రుణభారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. జీఎంఆర్ కంపెనీకి 10 వేలకు పైగా ఎకరాల భూమి ఉంది. వివిధ ప్రాంతాల్లో అప్రాధాన్య ఆస్తులను విక్రయించడం, వాటాలు విక్రయించడంపై దృష్టి సారించింది.
రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!
చైనా కంపెనీలు.. ఇండియాలో డిమాండ్
కరోనా కారణంగా చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్కు తరలించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న స్థలాల విక్రయం ద్వారా మెరుగైన ఆదాయం ఉంటుందని భావిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టులు, సెజ్లోని భూములు, బీవోటీ రోడ్డు ప్రాజెక్టులు విక్రయించేందుకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తాజా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లో తెలిపింది.
విద్యుత్ కేటగిరీ.. ఏపీలో కాకినాడ భూమి విక్రయం
- విద్యుత్ కేటగిరీలోని జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్కు చెందిన బార్జ్ మౌంటెడ్ పవర్ ప్లాంటును విక్రయించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు.
- కమాలాంగ ఎనర్జీని జేఎస్డబ్ల్యు ఎనర్జీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కరోనా నేపథ్యంలో అనిశ్చితుల వల్ల ఒప్పందం రద్దయింది.
- ఇలా విక్రయించే వాటిలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (కాకినాడ ఎస్ఐఆర్) కూడా ఉంది. ఈ రీజియన్లోని కొంత భూమిని విక్రయించేందుకు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. మౌలిక సదుపాయల ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచిస్తోంది.
- కాకినాడ ఎస్ఐఆర్లో 10,400 ఎకరాల భూమి ఉంది. ఇందులో 4,650 ఎకరాలను స్పెషల్ ఎకనమిక్ జోన్ (SEZ)గా నోటిఫై చేశారు. ఇక్కడ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
- తమిళనాడులోని కృష్ణగిరి ఎస్ఐఆర్ ప్రాజెక్టులో కొంతమేర భూములు విక్రయించాలని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తోంది.
నిధుల సమీకరణ
ఏపీ ప్రభుత్వం హల్దియా పెట్రో కెమికల్స్లో పెట్రో రసాయనాల రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు 2,500 ఎకరాల స్థలం ఏర్పాటు చేశారు. HPCL-GAILకు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం 2,000 ఎకరాలు కేటాయించింది.వీటితో పాటు చైనా స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీకి 500 ఎఖరాలు, ఆస్ట్రేలియాకు చెందిన లిథియమ్ రిఫైనరీ సంస్థకు 100 ఎకరాల స్థలం ఏర్పాటు చేశారు.
కాకినాడ ఎస్ఐఆర్లో భాగంగా 1950 ఎకరాల విస్తీర్ణంలో 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో నౌకాశ్రయాన్ని నిర్మించాలనే ప్రణాలిక ఉన్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది.
కొన్ని విభాగాల్లో కార్యకలాపాలు తగ్గించుకోవడం, మరికొన్ని పూర్తిగా విక్రయించడం ద్వారా నిధులు సమీకరించి సమీప భవిష్యత్తులో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ విభాగాల్లో దృష్టి కేంద్రీకరించే ఆలోచన ఉంది. రుణభారం కూడా తగ్గనుంది.