రోజుకు రూ 70 లక్ష కోట్లు ఆవిరి, ప్రపంచ మార్కెట్లకు కరోనా గ్రహణం!
కరోనా వైరస్.... ఒక్క చైనా నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఇప్పటికే సుమారు 3,000 మంది మరణానికి కారణమైన కరోనా వైరస్ .. మరో 1 లక్ష మందికి సోకి ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇటీవల కరోనా వైరస్ చైనా వెలుపల కూడా విజృభిస్తుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. సౌత్ కొరియా, ఇరాన్ సహా మరికొన్ని దేశాల్లో మరణాలు సంభవిస్తుండటంతో ఇకపై ఇది ప్రపంచవ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపుతుందని ఇన్వెస్టర్లలో భయాలు నెలకొన్నాయి.
దీంతో అమెరికా నుంచి మొదలు కొని జపాన్ వరకు అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఈ ఒక్క వారమే ప్రతి రోజూ పతనమవుతున్న వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్లలో రూ లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోతోంది. ఇందుకు సంపన్నులు కూడా మినహాయింపు ఏమీ కాదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ల లో కూడా ఈ వారం ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోయింది. 2008 గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంక్షోభం ఇప్పటి వరకు రాలేదు. ప్రపంచమంతా ఒకే అంశానికి వణికిపోయిన సందర్భాలు కూడా లేవు.
రోజుకు 1 ట్రిలియన్ డాలర్లు హుష్...
అమెరికా సహా ఇండియా, జపాన్ మార్కెట్ల వరకు చూస్తే... గత సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 1 ట్రిలియన్ డాలర్ల (రూ 70,00,000 కోట్లు) చొప్పున ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోయింది. దీనిని 6 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ 420 లక్షల కోట్లు) గా బ్లూమ్బెర్గ్ అంచనా వేసింది. అదే సమయంలో ప్రపంచంలోని 500 అత్యంత సంపన్నుల సంపద కూడా 444 బిలియన్ డాలర్లు హుష్ అయి పోయింది. ఇందులో ఒక్క అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి కుబేరులకు సంబంధించి సుమారు 40 బిలియన్ డాలర్ల వెల్త్ హరించుకుపోయింది. ఇండియా లో నెంబర్ 1 సంపన్నుడు ఐన ముకేశ్ అంబానీ సంపద కూడా 3 బిలియన్ల మేరకు కరిగిపోయింది. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్ల లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. ఈ పతనం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో, ఇంకా ఎంత పతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో అంచనా వేయలేక మార్కెట్ అనలిస్టులు తలకాయలు పట్టుకుంటున్నారు.
పట్టించుకోని మోడీ...
క వైపు కరోనా వైరస్ వ్యాప్తి... మరో వైపు దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఇండియాను కుదిపేస్తున్నాయి. గత రెండేళ్లుగా దేశంలో ఆర్థిక మందగమనం నెలకొన్నా దానిని పెద్దగా పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం... ఇప్పుడు కరోనా వైరస్ వల్ల సంభవించే నష్టాలను అంచనావేసేందుకు కూడా ప్రయత్నం చేయడంలేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... రెండో సారి అత్యధిక మెజారితో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ రాజకీయ, సామజిక లక్ష్యాలను మాత్రమే పట్టించుకుంటోంది కానీ, ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది అని అయన పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో చూసిన పరిస్థితులు రాజన్ చేసిన వ్యాఖ్యలకంటే భిన్నంగా ఏమీ లేవు అని విశ్లేషకులు చెబుతున్నారు.
పతనానికి నిజమైన కారణం ఏమిటి..
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కుదేలైనా కూడా ఏదో ఒక సాకు వెతుకుతుంటారు అనలిస్టులు. ప్రస్తుతం కూడా ఆ నెపాన్ని కరోనా వైరస్ పై తోచేస్తున్నారని భావించే మరో వర్గం అనలిస్టులు కూడా ఉన్నారు. ఈ వారంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు పతనం అయినా... లేదంటే గ్లోబల్ మార్కెట్లు నేల చూపులు చూసినా కూడా దానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ల విలువ ప్రస్తుతం చాలా అధికంగా ఉందని, అందుకే అది కరెక్షన్ కు లోనయిందని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ నెపాన్ని కరోనా వైరస్ పై రుద్దేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం కూడా ప్రపంచంలో కరోనా వంటిదే ఒక వైరస్ సుమారు 5 కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుందని, అప్పుడు మార్కెట్లు ఇలా ప్రవర్తించలేదని అంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ... మార్కెట్ల పతనం ఐతే నిజం. ఇన్వెస్టర్లు, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పతనం వల్ల అల్లాడిపోతున్నారనేది నిజం. అందుకే ఇప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీ ని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తే మార్కెట్లు కోలుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.