తీవ్ర ఆర్థిక సంక్షోభమే, వాటిపైనే ఆధారం, ఎప్పుడు కోలుకుంటామంటే: IMF
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కోబోతోందని ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్ (IMF) హెచ్చరించింది. కరోనాకు ముందే ప్రపంచం మందగమనంలో ఉందని, ఈ మహమ్మారి వల్ల ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోందని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జియోవా ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో ప్రపంచ ఆర్థికంలో పెద్ద ఎత్తున కోత తప్పదన్నారు.
పెను ఆర్థిక సంక్షోభం
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందిన దేశాలకు కరోనా వల్ల కలిగే ఆర్థిక సంక్షోభం పెను సవాల్గా మారనుందని చెప్పారు. ట్రేడ్ వార్, రాజకీయ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని క్రిస్టిలినా పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా 2020లో తీవ్ర ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కోబోతుందన్నారు.
తయారీ రంగం దెబ్బతిన్నది
కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు పెట్టుబడులను కోల్పోయాయని, పర్యాటకం దెబ్బతిన్నదని, ఆహారం, మెడిసిన్ వంటి సరుకుల దిగుమతిలో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది పెను సవాల్ అన్నారు. చైనా, సౌత్ కొరియా, ఇటలీలో ఇప్పటికే తయారీ రంగం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. ఎన్నో సేవలు, ఉత్పత్తులు నిలిచిపోయాయన్నారు.
ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందంటే
కరోనా వ్యాక్సీన్ అభివృద్ధి, థెరపీ, సప్లై చైన్ పునరుద్ధరించడంపై ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందనే అంశం ఆధారపడి ఉందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం మెరుగైన చర్యలు తీసుకుంటే ఈ క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ నుండి ఆర్థిక వ్యవస్థలు కోలుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి కారణంగా మరిన్ని మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆఫ్రికా ప్రాంతానికి 114 బిలియన్ డాలర్లు
వెనుకబడిన ఆఫ్రికా ప్రాంతానికి కరోనాపై పోరు కోసం ఇప్పటికీ 44 బిలియన్ డాలర్ల అవసరమని వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వెల్లడించింది. ప్రపంచంలోని పేద దేశాలకు ఇప్పటికే 57 బిలియన్ డాలర్లు సమీకరించారు. మరో 13 బిలియన్ డాలర్లు ప్రయివేటు ఫండ్స్ వచ్చాయని చెప్పారు. ఈ దేశాలకు 114 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా అన్నారు. ఈ లెక్కన మరో 44 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు.