Gold: భారత్లో పరుగులు తీస్తున్న బంగారం.. చైనా, టర్కీలే కారణమా..? పండుగల ముందు మెగా ప్లాన్..
Gold: భారతీయులు దసరా, దీపావళి, ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగల సమయంలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. పైగా వీటి తర్వాత పెళ్లిళ్ల సీజన్ వస్తుంది. అందువల్ల దీనిని దేశంలో అతిపెద్ద బంగారం కొనుగోలు సీజన్లలో ఒకటని వ్యాపారులు చెబుతుంటారు.
పెరుగుతున్న గోల్డ్..
దేశంలో ఈ పండుగ సీజన్లో బంగారం ధర ఆకాశాన్ని తాకవచ్చు. ఎందుకంటే విదేశీ బ్యాంకులు భారత్కు బంగారం సరఫరాను తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో గోల్డ్ సరఫరా చేసే బ్యాంకులు చైనా, టర్కీలతో పాటు ఇతర మార్కెట్లపై దృష్టి సారించేందుకు మెుగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా ప్రధాన పండుగలకు ముందు భారతదేశానికి ఎగుమతులను తగ్గించాయి. చైనా, టర్కీ వంటి దేశాల్లో బంగారంపై మెరుగైన ప్రీమియం లభిస్తున్నట్లు విదేశీ బ్యాంకులు చెబుతున్నాయి. గోల్డ్ వాల్ట్ ఆపరేటర్లు ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
సరఫరా కోతలతో..
ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం మార్కెట్ గా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో బంగారం సరఫరాలో కోత దేశీయ మార్కెట్లో బంగారం కొరతకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో బంగారం సరఫరా తగ్గితే.. ఈ పండుగ సీజన్లో వినియోగదారులు కొనుగోలు కోసం భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల బంగారం మరింత ఖరీదైనదిగ మారుతుంది.
స్పందించని బ్యాంకులు..
అంతర్జాతీయ బ్యాంకులైన ICBC స్టాండర్డ్ బ్యాంక్, JP మోర్గాన్, స్టాండర్డ్ చార్టర్డ్ భారతదేశానికి ప్రధాన బంగారం సరఫరాదారులుగా ఉన్నాయి. వీరు సాధారణంగా పండుగల సీజన్ కి ముందు భారీగా స్టాక్స్ సిద్ధం చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు వారి సేఫ్లలో 10% కంటే తక్కువ బంగారం మిగిలి ఉంది. అది కూడా ఏడాది కిందట దిగుమతి చేసుకున్నదేనని తెలుస్తోంది. టన్నుల్లో ఉండాల్సిన బంగారం కేవలం కిలోల్లోకి చేరుకుందని ముంబైకి చెందిన వాల్ట్ అధికారి ఒకరు చెప్పారు.
చైనా టర్కీలకు ఎందుకు..
ప్రపంచంలో బంగారానికి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న చైనాలో ఔన్స్ బంగారంపై ప్రీమియం 20 నుంచి 45 డాలర్ల వరకు ఉంది. చైనాలో కొవిడ్ లాక్డౌన్ తర్వాత కూడా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టర్కీలో పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశం వేగంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా టర్కీలో ఔన్స్ బంగారంపై ప్రీమియం ఏకంగా 80 డాలర్లుగా ఉంది. అందుకే అధిక లాభం కోసం బ్యాంకులు తమ సరఫరాను అటు మళ్లించాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ ఈ బ్యాంగులు విక్రయిస్తాయని అని ముంబైకి చెందిన ప్రముఖ బులియన్ సప్లై బ్యాంక్ అధికారి తెలిపారు.
భారత దిగుమతులు..
భారత్ బంగారం దిగుమతులు గత ఏడాదిలో పోల్చుకుంటే సెప్టెంబరులో 30 శాతం తగ్గి 68 టన్నులకు చేరుకుంది. ఇదే సమయంలో టర్కీ దిగుమతులు 543% పెరిగాయి. హాంకాంగ్ ద్వారా చైనా నికర బంగారం దిగుమతులు ఆగస్టులో దాదాపు 40% పెరిగి నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి.