గ్లెన్మార్క్ శుభవార్త, కరోనా ఫాబిఫ్లూ 27% తగ్గింపు: ఏ దేశంలో ఎంత ధర?
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కుల ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్ చికిత్సకు ఉపయోగించే వివిధ రకాల మందుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రూ.5,500గా ఉండే ధర రూ.25వేల నుండి రూ.30వేలకు కూడా బ్లాక్ మార్కెట్లో పలుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ గుడ్న్యూస్ చెప్పింది.
గుడ్న్యూస్: అమెరికా కంటే మనవద్ద కరోనా ఔషధం ధర 80% తక్కువ
రూ.103 కాదు.. ఇక రూ.75 మాత్రమే
ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో కరోనా చితిక్స కోసం వినియోగిస్తున్న Favipiravir ఔషధం ధరను తగ్గిస్తున్నట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం ప్రకటించింది. ఒక్కో టాబ్లెట్ పైన 27 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీని ధరను తొలుత రూ.103గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇరవై ఏడు శాతం తగ్గింపు నేపథ్యంలో రూ.75కే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
అందుకే ధర తగ్గింపు
కరోనా వైరస్ లక్షణాలు స్వల్ప, మోతాదుగా ఉన్నప్పుడు దీనిని వినియోగిస్తున్నారు. తాము ధరను తగ్గించినట్లు గ్లెన్ మార్క్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. భారత్లోని గ్లెన్ మార్క్ కేంద్రాల్లో అత్యుత్తమ పద్ధతుల్లో, ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్లో తక్కువకు ఔషధాలను తయారు చేస్తుండటంతో ధరను తగ్గించడానికి వెసులుబాటు లభించినట్లు తెలిపింది. ఇప్పుడు ఆ ప్రయోజనాలను బాధితులకు బదలీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇండియాలో ధర తక్కువ
ఇతర దేశాల్లో విక్రయిస్తున్న ఔషధంతో పోలిస్తే ఇండియాలో ధర అతి తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ ఇంటర్నల్ స్టడీలో తేలిందని వెల్లడించింది. ఇప్పుడు ధర కూడా తగ్గినందువల్ల బాధితులకు మరింతగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఔషధం పనితీరు, సామర్థ్యం కోసం వెయ్యి మందిపై పరిశోధన చేయనున్నామని తెలిపింది. ఫాబిఫ్లూను తయారు చేసి, మార్కెట్ చేసుకోవడానికి తమకు భారత డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి లభించిందని జూన్ 20వ తేదీన గ్లెన్ మార్క్ వెల్లడించింది.
ఏ దేశంలో ఎంత ధర?
ఫాబిఫ్లూ ధరను ఇండియాలో తొలుత రూ.103గా నిర్ణయించారు. ఇప్పుడు తగ్గించారు. భారత కరెన్సీ పరంగా చూస్తే ఇతర దేశాల్లో ధర ఎక్కువగా ఉంది. మన కరెన్సీ ప్రకారం రష్యాలో రూ.600, జపాన్లో రూ.378, బంగ్లాదేశ్లో రూ.350, చైనాలో రూ.215గా ఉంది. కాగా, గ్లెన్ మార్క్ షేర్ ఈ రోజు మధ్యాహ్నం గం.3 సమయానికి బీఎస్ఈలో 2 శాతం వరకు నష్టపోయి రూ.417 పలికింది.