ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి, సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం
న్యూఢిల్లీ: జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గి ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్నట్లుగా పీటీఐ తెలిపింది. అంతకుముందు అతి తక్కువ వృద్ధి రేటు 2012-13 ఆర్థిక సంవత్సరంలోని జనవరి - మార్చి త్రైమాసికంలో నమోదయింది. అప్పుడు 4.3 శాతం నమోదైంది. ఇప్పుడు దానికి సమీపంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే వాహన సేల్స్ తగ్గడం, ఎఫ్ఎంసీజీ మందగమనం వంటి వివిధ కారణాలతో గత క్వార్టర్లో జీడీపీ 5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి 4.5 శాతానికి పడిపోయినంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - సెప్టెంబర్ ఆరు నెలలకు గాను జీడీపీ 4.8 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 7.5 శాతంగా నమోదైంది.
జీడీపీ వృద్ధి రేటును రేటింగ్ సంస్థలు అన్ని గతంలో కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-20 వృద్ధి రేటును తొలుత 6.9 శాతంగా పేర్కొంది. అనంతరం దీనిని 6.1 శాతానికి సవరించింది.