అమెరికా కంటే దారుణం, భవిష్యత్తు కోసం దాచుకోవద్దు: ప్రభుత్వంపై రఘురాం రాజన్
కరోనా మహమ్మారి దెబ్బతో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఇది ప్రతి ఒక్కరికీ హెచ్చరిక అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, ఇటలీలతో పోల్చుకుంటే భారత్ దారుణంగా పతనమైందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడే రోగికి చికిత్స అవసరమని, కానీ అరోగ్యం క్షీణించిన తర్వాత అవసరం లేదన్నారు.
ఊరట: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్య
జీడీపీ సంకోచం ఆందోళనకరం
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ సంకోచం ఆందోళనకరంగా ఉందని రాజన్ అన్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వం, బ్యోరోక్రసీని వారి ఆత్మసంతృప్తి నుండి బయటపడేసి ఆర్థవంతమైన కార్యకలాపాల దిశగా తీసుకు వెళ్తుందని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. నిర్మాణం, తయారీ రంగం, హోటల్స్, ట్రాన్సుపోర్ట్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వృద్ధి రేటు రికార్డ్ స్థాయిలో పతనమైంది. ఈ మేరకు ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డిన్లో పోస్ట్ చేశారు.
భవిష్యత్తు కోసం వనరుల ఆదా స్వీయ ఓటమి
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అందించిన ఉపశమనం స్వల్పమేనని రాజన్ అన్నారు. భవిష్యత్తు కోసమంటూ నేడు వనరులను ఆదా చేసే వ్యూహం స్వీయ ఓటమికి కిందకు వస్తుందన్నారు. పేదలకు ఉచిత రేషన్, చిన్న, మధ్యతరహా కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు క్రెడిట్ హామీ ఇచ్చారని, కానీ భవిష్యత్తు ఉద్దీపనల కోసం ఈ రోజే మరింత చేయాల్సిన ప్రభుత్వం వనరులను ఆదా చేస్తోందని, ఇది సరికాదని, స్వీయ ఓటమి కిందకు వస్తుందన్నారు.
పేషెంట్కు అవసరమున్నప్పుడే చికిత్స కావాలి
ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడే చికిత్స అవసరమని, కానీ అవసరం లేనప్పుడు కాదని రఘురాం రాజన్ అన్నారు. MGNREGAకు మరిన్ని కేటాయింపులు, పేద వర్గాలకు మరింత నగదు బదలీ, వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిల క్లియరెన్స్ వేగవంతం చేయడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత నిధులు సమకూర్చడం అవసరమన్నారు. కరోనా కారణంగా అమెరికా, ఇటలీ ఎక్కువగా దెబ్బతిన్నాయని, మన ఆర్థిక వ్యవస్థ అక్కడి కంటే ఎక్కువగా చితికిపోయిందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడే చికిత్స అవసరమైనట్లుగా కరోనాతో పోరాడుతున్నప్పుడే ఉపశమనం అవసరమని, ఇప్పుడు ఆర్థిక ఉద్దీపన మన ఆర్థిక వ్యవస్థకు టానిక్ వంటిదన్నారు. రోగి ఆరోగ్యం క్షీణించాక చికిత్స చేసి లాభం లేదని, అలాగే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాక ఉద్దీపన ప్రభావం ఉండదన్నారు.