ఇక ఆసియా కుబేరుడు ముఖేష్ కాదు, అంబానీని దాటేసిన అదానీ
ఇప్పుడు భారత్ లేదా ఆసియా కుబేరుడు ఎవరో తెలుసా? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరు చెప్పబోతున్నారా? అయితే మీ సమాధానం తప్పు! రిలయన్స్ అధినేతను అదానీ గ్రూప్ చైర్మన్ అండ్ ఫౌండర్ గౌతమ్ అదానీ దాటేశారు. బ్లూమ్బర్గ్ నుండి అందుబాటులో ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఆసియా నెంబర్ వన్ ధనికుడిగా ఉన్న అంబానీని తాజాగా అదానీ దాటేశారు.
బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. అయితే ఈ డేటా అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టాయి. ఆరామ్కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి. రూ.2500కు పైకి ఉన్న రిలయన్స్ స్టాక్ ఇప్పుడు రూ.2350 దిగువకు వచ్చింది.
క్రితం సెషన్లో నాలుగు శాతానికి పైగా పడిపోయిన ఈ స్టాక్, నేడు మరో 5.7 శాతం క్షీణించింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 2.94 శాతం లాభపడి 1757.70 వద్ద, అదానీ పోర్ట్స్ 4.87 శాతం ఎగిసి రూ.764.75 వద్ద, అదానీ ట్రాన్సుమిషన్ 0.50 శాతం ఎగిసి రూ.1950 వద్ద, అదానీ పవర్ స్టాక్ 0.33 శాతం లాభపడి రూ.106.25 వద్ద ట్రేడ్ అయింది. అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ మాత్రం 1 శాతం చొప్పున నష్టపోయాయి.
ఇయర్ టు డేట్ (2021 జనవరి 1 నుండి ఇప్పటి వరకు) అదానీ సంపద 55 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అదే సయంలో ముఖేష్ అంబానీ సంపద 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది.