Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
Q3 Results: ఇటీవల కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో కొన్ని విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలను ఆర్జించి మతిపోగొడుతుండగా.. మరికొన్ని మాత్రం లాభాలు తగ్గటంతో ఇన్వెస్టర్లను బేజార్చాయి. అసలు టెక్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసిన ఎల్ అండ్ టీ..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మెరుగైన అమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & టెక్నాలజీ సేవల పోర్ట్ఫోలియోలో వృద్ధి లాభాల పెరుగుదలకు దోహదపడింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం దాదాపు 24 శాతం పెరిగి రూ.2,553 కోట్లుగా నమోదైంది. అయితే ఈ వృద్ధి సంఖ్యలు విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువని చెప్పుకోవాలి. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం సైతం గత సంవత్సరం కంటే 17 శాతం మేర పెరిగింది.
టెక్ మహీంద్రా ఫలితాలు..
దేశీయ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సైతం తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో నెట్ ప్రాఫిట్ 5 శాతం మేర తగ్గి రూ.1,297 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ 795 మిలియన్ డాలర్లు విలువైన ఆర్డర్లను పొందింది. కంపెనీ గత సంవత్సరం ఇదే కాలంలో రూ.1,368 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఐటీ రంగంలో మాంద్యం వల్ల నెలకొన్న మందగమనం వల్లనే ఆదాయ అంచనాలను కంపెనీ అందుకోలేక పోయిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL) క్యూ-3 లాభాల నమోదులో భేజారు కనబరిచింది. మూడో త్రైమాసిక ఫలితాలు 92 శాతం మేర తగ్గటంతో లాభం రూ.245 కోట్లకు పరిమితమైంది. కంపెనీ ఫలితాలు అంచనాలను తారుమారు చేయటంతో స్టాక్ సైతం 5 శాతం మేర నష్టపోయింది. అయితే ఈ కాలంలో వ్యాపార ఆదాయం 37.2 శాతం మేర పెరిగి రూ.35,380 కోట్లుగా నమోదైంది.