SBI షాకింగ్ రిపోర్ట్: 16 లక్షల ఉద్యోగాలు తగ్గాయి, శాలరీపైనా ప్రభావం, కారణమిదే
ఆర్థిక మందగమనం ఉద్యోగాల సృష్టికి అవరోధంగా మారింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మందగమనం కారణంగా లక్షలాది ఉద్యోగాల సృష్టి తగ్గుతుందని అంచనా. ఈ మేరకు SBI రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2018-19లో 89.7 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరగగా, 2019-20లో 16 లక్షలు తగ్గవచ్చునని అంచనా. ఉద్యోగార్థుల ఆశలను మందగమనం ఆవిరి చేస్తోంది. ఉపాధి కల్పన రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
వాడియా సంచలనం, రతన్ టాటాకు 'రూ.3వేల కోట్ల' ఊరట
15.8 లక్షల ఉద్యోగాల తగ్గుదల
2018-19లో 89.7 లక్షల కొత్త కొలువులు పుట్టుకొచ్చాయని ఈపీఎఫ్వో గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2019-20 ఏప్రిల్-అక్టోబర్ నెల వరకు 43.1 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. దీని ప్రకారం అంచనా వేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 73.9 లక్షల ఉద్యోగాలు రావచ్చని SBI రీసెర్చ్ అంచనా. దీంతో గతంతో పోల్చితే ఈసారి 15.8 లక్షల ఉద్యోగాలు తగ్గవచ్చు.
వారి ఆదాయం పడిపోయింది
గత ఏడాది కాలంలో అసోం, రాజస్థాన్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వలస కార్మికుల ఆదాయం పడిపోయింది. వారి కుటుంబాలకు వారి నుంచి వెళ్తున్న సొమ్ము తగ్గిందని ఈ రిపోర్ట్ తెలిపింది. కాగా, రూ.15,000 వరకు వేతనం లభించే ఉద్యోగాలనే ఈపీఎఫ్ఓ పరిగణలోకి తీసుకుంటుంది.
ఇవి కూడా 39,000 తగ్గవచ్చు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధిక వేతనాలు ఉంటే ప్రయివేటు ఉద్యోగాల వివరాలు ఉండవు. ఈ తరహా ఉద్యోగాల వివరాలు 2004 నుంచి జాతీయ పెన్షన్ పథకానికి (NPS) వెళ్తున్నాయి. అయితే 2019-20లో NPS విభాగంలోకి వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉధ్యోగాల సృష్టి కూడా ఇప్పుడున్న ధోరణి ప్రకారం 39,000 వరకు తగ్గవచ్చునని రిపోర్ట్ తెలిపింది.
ఉద్యోగాలు తగ్గిపోవడానికి ఇదీ కారణం
అసోం, బీహార్, రాజస్ధాన్, ఒడిశా, యూపీలకు వలసలు వెళ్లిన కార్మికులు తమ ఇళ్లకు చేరవేసే మొత్తాలు గణనీయంగా తగ్గాయనే గణాంకాలను తెలిపింది. దివాళా ప్రక్రియలో కేసుల పరిష్కారంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ఆయా కంపెనీలు తమ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యలో కోత విధించడం కూడా కొలువులు తగ్గిపోవడానికి కారణమని తెలిపింది.
వలస వెళ్లి డబ్బులు పంపిస్తున్నారు
పేదలు, ఇతరులకు గత కొన్నేళ్లుగా వలస వెళ్లడమే జీవన వనరుగా మారిన పరిస్థితి ప్రతిబింబిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. వ్యవసాయం, పారిశ్రామికం సహా వివిధ రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాలకు చెందిన వారు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వెళ్లి, తమ సొంత ఇళ్లకు డబ్బులు పంపుతున్నారని పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థకు మరింత ముప్పు
మందగమనం కారణంగా వాణిజ్య సంస్థలు, కార్మికులు రుణాలపై అధికంగా ఆధారపడే పరిస్థితి ఎదురైందని, దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదముందని ఈ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
వేతనాల వృద్ధిపై ప్రభావం
ఉత్పత్తి సామర్థ్యం తగ్గిన ప్రభావం వేతనాల వృద్ధి రేటుపై పడింది. మరోవైపు, పెరుగుతున్న ఖర్చులకు తగిన ఆదాయం లేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని పేర్కొంది.