అమెజాన్ వర్సెస్ బిగ్బజార్..మధ్యలో రిలయన్స్: సుప్రీంలో పిటీషన్ ఫైల్
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగం దిగ్గజ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ గ్రూప్-అంతర్జాతీయ ఇ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదిరిపోయాయి. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ను దాఖలు చేసే స్థాయికి చేరుకున్నాయి. అమెజాన్కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ రిటైల్ కంపెనీ అధినేత కిషోర్ బియాని.. తాజాగా అప్పీల్కు వెళ్లారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యాహ్నం ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు.
ఫ్యూచర్ రిటైల్ ఆధీనంలోని బిగ్ బజార్ ఆస్తులను, ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ రిటైల్ టేకోవర్ చేయడాన్ని అమెజాన్ అడ్డుకున్న విషయం తెలిసిందే. 24,713 కోట్ల రూపాయలకు సంబంధించిన టేకోవర్ డీల్ ఇది. 24,713 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యూచర్ రిటైల్కు సంబంధించిన ఆస్తులను టేకోవర్ చేయాలని రిలయన్స్ రిటైల్స్ నిర్ణయించింది.
ఇదే ఫ్యూచర్ రిటైల్స్ కంపెనీలో అమెజాన్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇదివరకే జెఫ్ బెజోస్ సారథ్యంలోని అమెజాన్.. ఫ్యూచర్ రిటైల్స్లో 10 శాతం మేర పెట్టుబడులను పెట్టింది. ఫ్యూచర్ రీటైల్ ఆస్తులు రిలయన్స్లో విలీనం అవ్వడాన్ని తప్పుబడుతూ అమెజాన్ సంస్థ సింగపూర్ కోర్టును మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా గతంలో కోరింది. అయితే అమెజాన్ సంస్థ చెబుతున్నట్లుగా ఫ్యూచర్ రీటైల్ సంస్థతో పార్ట్నర్గా ఉంటూ మరో సంస్థలో ఆస్తులు విలీనం చేయడమనేది సరికాదని వెల్లడించింది.
సింగపూర్ మధ్యవర్తిత్వాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్న ధర్మాసనం అమెజాన్ సంస్థ పిటిషన్లో తమకు ఎలాంటి తప్పులు కనిపించడం లేదని పేర్కొంటూ ఆ సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ కోను కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6వ తేదీన ఫ్యూచర్ రిటైల్స్ను ఆదేశించింది. దీనివల్ల నష్టపోయేది ఈ సంస్థే. నష్టాలు వస్తోండటం వల్ల తన కంపెనీని మరొకరికి విక్రయించడానికి చాలాకాలంగా కిషోర్ బియాని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
అందులో పెట్టుబడులు పెట్టడానికి, బిగ్ బజార్ ఆస్తులను టేకోవర్ చేయడానికి రిలయన్స్ రిటైల్స్ ముందుకు వచ్చింది. 24,713 కోట్ల రూపాయలతో టేకోవర్ డీల్ను కుదుర్చుకుంది. అదే సమయంలో అమెజాన్ అడ్డుపడటం వల్ల ఇష్యూ కోర్టు మెటెక్కింది. ఢిల్లీ హైకోర్టు అమెజాన్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల తాజాగా కిషోర్ బియాని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 24,731 కోట్ల డీల్ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.