వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: పలు నగరాల్లో రికార్డ్ గరిష్టానికి...
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో నేడు (మే 12) ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఈ నెలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన రూ.1.65, లీటర్ డీజిల్ పైన రూ.1.88 పెరిగింది. నేడు పెట్రోల్ ధరలు 25 పైసలు, డీజిల్ ధరలు 25 పైసలు పెరిగింది. ఈ నెలలో పెరగడం ఇది ఏడోసారి. గత వారం వరుసగా నాలుగు రోజులు, ఈ వారం వరుసగా మూడు రోజులు పెరిగాయి. గత శనివారం, ఆదివారం మాత్రం ధరల్లో మార్పులేదు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రూ.100 మార్కును దాటింది. పెట్రోల్ జైసల్మేర్లో రూ.101కి చేరువైంది. బికానీర్ను అదే పరిస్థితి. బార్మెర్లో రూ.100 క్రాస్ అయింది. మహారాష్ట్రలోని నాందెడ్లో పెట్రోల్ రూ.100.50 పైసలు దాటింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటితో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 70 డాలర్లకు సమీపంలో ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 15 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి 68.70 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 21 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి 65.49 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.