మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: సరికొత్త రికార్డుకు ఇంధనం
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మే, 27 గురువారం) పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 24 పైసలు, డీజిల్ పైన 29 పైసలు పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్కు రూ.93.68, డీజిల్ రూ.84.61గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.99.94, డీజిల్ రూ.91.87గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. ఇక, రాష్ట్రాల రాజధానుల విషయానికి వస్తే రూ.100 దాటిన మొదటి రాజధాని భోపాల్.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యాట్ కారణంగా ధరల్లో మార్పు ఉంటుంది. రాజస్థాన్లో పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ ఉంది. అందుకే అక్కడ లీటర్ పెట్రోల్ పలు ప్రాంతాల్లో రూ.100 దాటింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోను ఎక్కువ వ్యాట్ ఉంది. అందుకే ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ ట్యాక్స్ను వేయడం పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో పెట్రోల్, డీజిల్ వినియోగం క్షీణించింది. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 75 శాతం డిమాండ్ పడిపోయింది. రాజస్థాన్లో పెట్రోల్ పైన 36 శాతం, డీజిల్ పైన 26 శాతం వ్యాట్ ఉంది. మణిపూర్ తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికైనా ఇది అత్యధికం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన 2 శాతం చొప్పున వ్యాట్ను తగ్గించింది. అయినప్పటికీ మణిపూర్(36.5 శాతం) తర్వాత రాజస్థాన్లో వ్యాట్ అధికం.