అక్కడ లీటర్ పెట్రోల్ రూ.420: అదే రేంజ్లో డీజిల్..అయినా
కొలంబో: పొరుగుదేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. రాత్రికి రాత్రే ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకోవట్లేదు. ఆర్థికంగా మరింత ఊబిలోకి చిక్కుకుంటోంది. భారత్ సహా జీ7 దేశాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నప్పటికీ.. అవి ఏ మాత్రం చాలట్లేదు. అలాగని- తమ తాహతుకు మించి శ్రీలంకను ఆదుకోవడానికి సాహసించట్లేదు.
ఇంధన కొరతతో..
మాజీ ప్రధాని మహీంద రాజపక్సను తొలగించడం, ఆయన సారథ్యంలోని మంత్రివర్గాన్ని దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స రద్దు చేసిన తరువాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని నియంత్రించడానికి అత్యయిక పరిస్థితిని విధించారు అప్పట్లో. పరిస్థితులు మెరుగుపడటం వల్ల ఎమర్జెన్సీని ఎత్తేసినప్పటికీ.. అక్కడ నెలకొన్న ఇంధన కొరత, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడం వల్ల ఉద్రిక్తత కొనసాగుతూనే వచ్చింది.
మరో 500 మిలియన్ డాలర్లు..
ఈ పరిణామాల మధ్య శ్రీలంక ప్రభుత్వం భారత సహాయాన్ని కోరింది. రోజుల తరబడి పెట్రోల్, డీజిల్ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు లంకేయులు. దీనితో భారత్ 400 మెట్రిక్ టన్నుల పెట్రోల్ను శ్రీలంకకు పంపించింది. అదే ఇప్పుడు ఆ దేశాన్ని కొద్దో, గొప్పో ఆదుకుంటోంది. అదే సమయంలో- ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డెక్కడానికి భారత్ నుంచి మరో 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరింది శ్రీలంక. ఇందులో అధిక మొత్తాన్ని ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వినియోగించాలని భావిస్తోంది.
పెట్రోల్, డీజిల్పై..
పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి రావడంతో వాటి విక్రయాలను మొదలు పెట్టింది సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్. వాటి ధరలను భారీగా పెంచింది. అక్టేన్ 92 పెట్రోల్ ధరలో 24.3 శాతం అంటే 82 రూపాయలు, అక్టేన్ 92 డీజిల్ ధరలో 38.4 శాతం అంటే 111 రూపాయలు పెరిగింది. పెరిగిన ఇంధన ధరలు ఈ తెల్లవారు జామున 3 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంధన ధరల ఫార్ములాను నిర్ధారించడానికి శ్రీలంక మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
అన్ని ఖర్చులను కలుపుకొని..
అనంతరం దీనికి ఆమోదం తెలిపినట్లు విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కంచన విజెశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకోవడానికి చేసిన ఖర్చుతో పాటు రవాణా, దాన్ని దేశంలోని వేర్వేరు ఇంధన డిపోలకు తరలించడానికి అయిన వ్యయం, పన్నులను కలుపుకొని వాటి ధరలను నిర్ధారించినట్లు మంత్రి పేర్కొన్నారు. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్కు అనుబంధంగా కొనసాగుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కిరోసిన్ విక్రయించట్లేదని, అది కొంత నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు.
ఆటో రిక్షాల కనీస రేటు 90 రూపాయలు..
డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రాత్రికి రాత్రి 111 రూపాయల మేర పెరగడం వల్ల దాని ప్రభావం రవాణారంగంపై పడింది. ఆటోరిక్షా డ్రైవర్లు తమ ఛార్జీలను భారీగా పెంచారు. ఇదివరకు కనీస ఛార్జీ 80 రూపాయలు ఉండగా.. దాన్ని 90 రూపాయలకు పెంచారు. ఒక కిలోమీటర్కు కనీస ఛార్జీ 90 రూపాయలుగా నిర్ధారించారు. ఆ తరువాత ప్రతి కిలోమీటర్కు 80 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.