మండుతోన్న ఇం‘ధనం’! ఏడాది గరిష్టానికి పెట్రోల్ ధరలు...
ఇంధనం ధరలు మండిపోతున్నాయి. పైసా.. పైసా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. పెట్రోల్ ధర అయితే దూకుడు మీద ఉంది. అంతేకాదు, పెట్రోల్ ధరలు ఇప్పట్లో ఆగేలా కూడా లేవు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటోన్న ముడి చమురు ధరలే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
ఢిల్లీ, ముంబై, కోల్కతాలో సోమవారం (నవంబర్ 25) పెట్రోల్ ధర లీటర్కు 12 పైసలు చొప్పున పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర 13 పైసలు ఎగిసింది. ఢిల్లీలో గత నాలుగు రోజుల్లోనే పెట్రోల్ ధర 46 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో.. పెట్రోల్ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. గుడ్డిలో మెల్ల నయం అన్నట్లుగా.. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. అయినప్పటికీ పెట్రోల్కు, డీజిల్కు పెద్ద తేడా లేదంటూ సామాన్యుడు సణుగుతున్నాడు.
ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.80.32 ఉండగా, ఢిల్లీలో ధర రూ.74.66గా ఉంది. ఇక కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర్ రూ.77.34గా, చెన్నైలో రూ.77.62గా ఉన్నాయి. డీజిల్ ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో రూ.65.73, కోల్కతాలో రూ. 68.14, ముంబైలో రూ.68.94, చెన్నైలో రూ.69.47గా ఉన్నాయి. పెట్రోల్ ధరలు తగ్గకపోగా.. రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఆ ప్రభావం అక్కడి ప్రజా రవాణాపై తీవ్రంగా పడుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరత్రా పనులపై బయటికెళ్లేవారు తమ సొంత వాహనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మెకు తోడు, పెట్రోల్ ధరలు పెరగుతుండడం వినియోగదారులను కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా ఎడాపెడా పెట్రోల్ ధరలను పెంచేస్తున్నాయి.