మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడే వారిని గుర్తించేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' అన్ని మార్గాల్లో నుంచి సమాచారం సేకరిస్తోంది. కొన్నాళ్ల క్రితం దీప్ ఇండస్ట్రీస్ .. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఫేస్బుక్ అకౌంట్ల ఆధారంగా సెబీ అనుమానితులను పట్టుకోవడం తెలిసిందే.
తాజాగా స్టాక్ మర్కెట్లో 'ఫ్రంట్ రన్నింగ్' ఆరోపణలు ఎదుర్కొంటున్న వైభవ్ ధడ్డా అలియాస్ అవి అనే ట్రేడరు ఆనుపానులను కూడా ఇలాగే ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా గుర్తించింది. వైభవ్ ధడ్డాతోపాటు అతడి కుటుంబ సభ్యుల మరో ఇద్దరిపై.. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది.
ముందస్తు సమాచారంతో అక్రమాలు...
ఫిడిలిటీ గ్రూప్లో పనిచేస్తున్న వైభవ్ ధడ్డాకు.. కీలకమైన ఆర్డర్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండేది. దీని ఆధారంగా అతడు, అతడి తల్లి అల్కా ధడ్డా, సోదరి ఆరుషి ట్రేడింగ్ నిర్వహించేవారు. హాంకాంగ్లో పనిచేస్తున్న వైభవ్కు కుటుంబ సభ్యుల ట్రేడింగ్ అకౌంట్లు అందుబాటులో ఉండేవి. దీంతో ఫిడిలిటీ గ్రూప్ ఇచ్చే భారీ బై, సెల్ ఆర్డర్లతో షేర్ల ధరలలో వచ్చే మార్పులను వీరు తమకు అనువుగా మలుచుకుని, ట్రేడింగ్ నిర్వహించేవారు.
మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా...
వైభవ్కి సంబంధించిన ఇతర వివరాలను సేకరించే క్రమంలో ‘జైన్శుభ్బంధన్డాట్కామ్'లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా ఈ ముగ్గురి మధ్య బంధుత్వాన్ని సెబీ గుర్తించింది. ఈ వెబ్సైట్లో వైభవ్.. అల్కా ధడ్డాను తన తల్లిగా పేర్కొన్నట్లు ఈ నెల 5వ తేదీ నాటి ఇంటరియం ఆదేశాల్లో సెబీ పేర్కొంది. అంతేకాదు, వైభవ్ తన పాస్పోర్టు వివరాలలోనూ తల్లిగా అల్కా ధడ్డానే చెప్పుకున్నారు. మొత్తానికి ఇలా ‘జైన్శుభ్బంధన్డాట్కామ్' ద్వారా వైభవ్ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను ‘సెబీ' ధృవీకరించుకుంది.
ట్రేడింగ్ జరపకుండా ముగ్గురిపైనా నిషేధం...
ఇలా సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత వైభవ్, ఆయన తల్లి అల్కా, సోదరి ఆరుషిలను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. అంతేకాదు, అక్రమ లావాదేవీల ద్వారా వీరు అక్రమంగా ఆర్జించిన రూ.1.86 కోట్లను కూడా 15 రోజుల్లోగా ఏదైనా జాతీయ బ్యాంకులో ఎస్క్రో ఖాతా ఓపెన్ చేసి అందులో జమచేయాలంటూ ఆదేశించింది. ఈలోగా ఆ నిధులను వారు దారిమళ్లిస్తారేమో అన్న అనుమానంతో వారి బ్యాంకు ఖాతాలను సైతం సెబీ స్తంభింపజేసింది.
ఏమిటీ ‘ఫ్రంట్ రన్నింగ్'?
స్టాక్ మార్కెట్లోని పెద్ద ప్లేయర్లు ఇచ్చే బై, సెల్ భారీ ఆర్డర్లను ముందుగానే తెలుసుకుని, ట్రేడింగ్ ద్వారా లబ్ది పొందడాన్నే ‘ఫ్రంట్ రన్నింగ్' అంటారు. వైభవ్ విషయానికి వస్తే.. ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోని ఫిడిలిటీ గ్రూప్ తరఫున ట్రేడర్. సాధారణ పబ్లిక్కు తెలియని ఫిడిలిటీ గ్రూప్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు అందుబాటులో ఉండేది. ఈ ఇన్ఫర్మేషన్ను ఆసరాగా చేసుకుని అల్కా, ఆరుషిలు ట్రేడింగ్లో లాభాలు సంపాదించుకున్నారు.
వైభవ్ కుటుంబ సభ్యులు ఇలా చేసేవారు...
ఫిడిలిటీ గ్రూప్ ఇచ్చే భారీ బై, సెల్ ఆర్డర్లతో షేర్ల ధరలలో వచ్చే మార్పులను వైభవ్ కుటుంబసభ్యులు తమకు అనువుగా మలుచుకుని, ట్రేడింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించినట్లు సెబీ పేర్కొంది. ఫిడిలిటీ గ్రూప్ కొనడానికి కొంచెం ముందుగా కొనడం, అలాగే ఫిడిలిటీ గ్రూప్ అమ్మడానికి కంటే కొంచెం ముందుగా అమ్మేసేవారని.. అల్కా, ఆరుషిల ట్రేడింగ్ తీరు ద్వారా ఈ విషయం బయటపడిందని సెబీ తెలిపింది. అల్కా, ఆరుషిల ఈ ‘ఫ్రంట్ రన్నింగ్' యాక్టివిటీ వల్ల సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారని వివరించింది.