fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
fpi: ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ జరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇదే పంథా కొనసాగుతోంది. ఒక్క శుక్రవారం రోజే సుమారు 6 వేల కోట్లకు పైగా ఈక్విటీల నుంచి బయటకు మళ్లాయి. చైనా హాంకాంగ్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్ వంటి చౌక మార్కెట్లు ఓపెన్ కావడంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
NSDL సైతం ధృవీకరించింది:
ఈ నెల మొత్తం FPI లు భారతీయ మార్కెట్లలో షార్టింగ్ చేసి లాభాలు గడించారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఒక్క జనవరి 27న 5,997 కోట్ల రూపాయల భారీ అమ్మకాలతో పాటు అదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణలు కూడా ఈ సంక్షోభానికి కారణం కావచ్చన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి శుక్రవారం వరకు మొత్తం 17 వేల కోట్లకు పైగా FPI ల సంపద బయటకు వెళ్లినట్లు NSDL డేటా సైతం ధృవీకరిస్తోంది.
అదానీపై ఆరోపణలూ కారణమే:
క్యాష్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారుల మొత్తం అమ్మకాలు 41 వేల కోట్లకు చేరుకున్నాయని విజయకుమార్ తెలిపారు. అదానీ స్టాక్ లో క్రాష్ వంటి తాత్కాలిక కుదుపులు సైతం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం FPIలు దాదాపు 6 వేల కోట్లను విక్రయించగా.. దేశీయ పెట్టిబడుదారులు 4 వేల కోట్లకు పైగా కొనుగోళ్లు చేశారు. కాగా.. ఈ నెలలో గత శుక్రవారమే FPIల అతి పెద్ద అమ్మకం నమోదైంది.
సెన్సెక్స్, నిఫ్టీల్లో భారీ క్షీణత:
జనవరిలో ఈక్విటీల్లోని FIIలు దాదాపు 29 వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినట్లు డేటా చెబుతోంది. అంతకు ముందు నెలలో ఇది కేవలం 14 కోట్లే. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 3 శాతం చొప్పున క్షీణించాయి. ఒక్క శుక్రవారమే సెన్సెక్స్ 874 పాయింట్లు (1.45 శాతం), నిప్టీ 287 పాయింట్లు (1.61 శాతం) నష్టపోయాయి. ఈక్విటీల్లో మాత్రమే కాకుండా హైబ్రిడ్ మార్కెట్లలోనూ FPIలు ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. బడ్జెట్ ముందు మార్కెట్ లో మంచి ర్యాలీ లేనందున తర్వాత ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.