ఆ కారు కొనాలంటే బుకింగ్ చేసి, నాలుగేళ్లు వేచి చూడాలి: ఎందుకంటే
ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే డబ్బులు కట్టిన నిమిషాల్లో మన చేతికి వస్తుంది. గతంలో మన దేశంలో లైసెన్స్ రాజ్ అమల్లో ఉన్నప్పుడు ఓ స్కూటర్ను బుక్ చేసిన తర్వాత అది మన చేతికి రావడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టేది. ఇప్పుడు మళ్లీ దానిని తలపిస్తోంది టొయోటా. అయితే టొయోటా నుండి వస్తున్న ప్రీమియం కారు ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 వాహనానని బుక్ చేసిన నాలుగేళ్ల తర్వాత కానీ చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇందుకు ప్రధాన కారణం సెమీ కండక్టర్ల కొరత. కంపెనీ కూడా దీనిని అంగీకరించి, క్షమాపణలు చెప్పింది.
నాలుగేళ్లు వేచి చూడాలి
టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 మోడల్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే దీనిని బుక్ చేసుకున్న వారు ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా నాలుగేళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ కాల వ్యవధిని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. ఇతర మార్కెట్లలో కూడా ఎల్సీ 300 విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ బుకింగ్దారులు నాలుగేళ్లు వెయిట్ చేయాలని చెప్పింది. భారత్లో 2022 థర్డ్ క్వార్టర్లో విడుదలయ్యే అవకాశముందని భావించారు. కానీ 2023 చివరి నాటికి గానీ ఇది అందుబాటులోకి రాకపోవచ్చు. ఈ కారు అత్యాధినిక టెక్నాలజీతో, అధిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వచ్చారు. కాబట్టి ఈ కారు తయారీకి పెద్ద ఎత్తున సెమీ కండక్టర్లు అవసరం. అయితే గత కొంతకాలంగా సెమీ కండక్టర్ల కొరత తలెత్తడంతో ఉత్పత్తిలో అవాంతరాలు వస్తున్నాయి.
వాటికి పోటీ
ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300ని టీఎన్జీఏ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఎల్సీ 200తో పోలిస్తే దీని బరువు 200 కిలోలు తక్కువ. పది శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తోంది. రెండు వేరియంట్ల ఇంజిన్స్ అందుబాటులో ఉన్నాయి. 3.5 లీటర్, ట్విన్ టర్బో చార్జ్డ్ వీ5 ఆయిల్ బర్నర్ ఇంజిన్, 650 ఎన్ఎం టార్క్ వద్ద 415HP శక్తిని విడుదల చేసింది. మరో ఇంజిన్ 3.3 లీటర్ ట్విన్ టర్బో వీ6 డీజిల్ ఇంజన్ఎన్ఎం టార్క్ వద్ద 309HP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింట్లోను టెన్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైన ఉంటుందని అంచనా. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ బీఎస్, బిఎండబ్ల్యు ఎక్స్ 6 మోడల్స్కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
చిప్ షార్టేజ్
చిప్ షార్టేజ్ కారణంగా ప్రపంచ దిగ్గజ ఆటో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే అధికారికంగా మాత్రం సెమీ కండక్టర్ల కొరత వల్ల ఈ ఆలస్యమని చెప్పడం లేదు. ఇప్పటికే జపాన్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా 11 ఉత్పత్తి ప్లాంట్స్ను మూసివేసింది టొయోటా. జనరల్ మోటార్స్, ఫోర్డ్, నిస్సాన్, డైమ్లర్, బీఎండబ్ల్యు, రెనాల్ట్ కార్ మేకర్స్ కూడా ఇటీవల ఉత్పత్తిని తగ్గించాయి.