అమెరికా, ఆ తర్వాత ప్రపంచం మాంద్యంలోకి వెళ్తుందా?
అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టేందుకు ఇబ్బందికరమైనప్పటికీ మరిన్ని రేట్ల పెంపుకు వెళ్తామని అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ పేర్కొన్నారు. కీలక వడ్డీ రేట్లను భారీగా పెంచడం, మున్ముందు మరిన్ని పెంపులు ఉంటాయని చెప్పడం కారణంగా మాంద్యం తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావిస్తున్నారు.
వృద్ధి మందగించి, అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లకుండా ఫెడ్ ప్రయత్నించాలని భావిస్తోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికా ద్రవ్యోల్భణం 8.6 శాతానికి చేరుకుంది. 1981 తర్వాత ఇలా పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ఫెడ్ సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 1994 తర్వాత ఇంత భారీగా వడ్డీ రేట్లు పెంచడం ఇదే మొదటిసారి.
ఫెడ్ రిజర్వ్ జీడీపీ వృద్ధి అంచనాలను 2.8 శాతం నుండి 1.7 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగమనంతో పాటు ధరల కట్టడికి ఫెడ్ భారీ పెంపులు వచ్చే ఏడాది అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టవచ్చునని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తే ప్రపంచ దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు.
వృద్ధికి ఇబ్బందికరంగా మారే వడ్డీ రేట్ల పెంపు వల్ల మాంద్యం ప్రమాదం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది. ద్రవ్యోల్భణం 4 శాతానికి పైకి చేరుకున్నప్పుడు, నిరుద్యోగం 5 శాతం దిగువకు చేరినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండేళ్ల కాలంలోనే మాంద్యంలోకి జారుకుంది. ఇప్పుడు నిరుద్యోగిత రేటు 3.6 శాతంగా ఉండగా, ద్రవ్యోల్బణం మార్చి నుండి 8 శాతానికి పైన ఉంది.