కీలక ప్రకటన: రక్షణ తయారీలో FDI పరిమితి 49% నుండి 74% పెంపు, కార్పోరేట్ బాడీలుగా..
రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు దిగుమతులు తప్పనిసరి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (మే 16) 8 రంగాలకు ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో భాగంగా డిఫెన్స్ ఉద్దీపనలు వివరించారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమేటిక్ రూట్ కింద పెట్టుబడుల పరిమితిని 49% నుండి 74% పెంచుతున్నట్లు తెలిపారు.
5 లక్షల ఎకరాలు సిద్ధం, ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు: నిర్మల సీతారామన్
రక్షణ రంగంలో దిగుమతులు తప్పవు
రక్షణ రంగానికి నాణ్యమైన, ఉన్నతమైన ఉత్పత్తులు అవసరమని నిర్మల చెప్పారు. రక్షణ రంగంలో అత్యాధునిక సాధనా సంపత్తిని సమకూర్చుకునేందుకు దిగుమతులు తప్పవన్నారు. ఇప్పటి నుండి అవసరమైన దిగుమతులు చేసుకుంటేనే మేకిన్ ఇండియా ద్వారా సొంతగా తయారు చేసుకోగలుగుతామని చెప్పారు. ఆయుధాలకు అవసరమైన విడిభాగాలను మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసుకోవచ్చునని చెప్పారు.
కార్పోరేట్ బాడీలుగా.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు
ఆయుధాలు, విడిభాగాల తయారీకి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పోరేట్ బాడీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తామన్నారు. కార్పోరేటైజ్ అంటే ప్రయివేటీకరణ కాదని, దీని అర్థం సామర్థ్యం, నైపుణ్యాల పెంపు మాత్రమే అన్నారు. ఆయుధాల ఉత్పత్తి, పరిశోధనలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు పారదర్శక నిర్ణయాలు తీసుకుంటాయన్నారు.
దిగుమతుల నిషేధ జాబితా
దిగుమతులకు సంబంధించి నిషేధించిన ఆయుధాలు లేదా ప్లాట్ఫామ్స్ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుందన్నారు. అప్పుడు నిషేధం విధించిన వస్తువులను భారత్లో మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.
ఆయుధాల సేకరణ, తయారీదారుల ఎంపికలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తామని చెప్పారు. నిర్దేశిత గడువులోపు తయారీదారుల ఎంపిక, ఆయుధాల సేకరణ ఉంటుందని చెప్పారు.