20 ఏళ్లలో 37 లక్షల కోట్లు, భారత్ సరికొత్త మైలురాయి: 1999 నుండి FDI దూకుడు
భారత్లోక పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత 20 సంవత్సరాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో మారిషస్ నుండి అత్యధికంగ 29 శాతం వచ్చాయి. భారత వృద్ధి సామర్థ్యంపై విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు దోహదపడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలోను ఇటీవల పెద్ద ఎత్తున FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) వచ్చాయి. మొత్తంగా గత ఇరవై ఏళ్లలో ఈ పెట్టుబడులు రికార్డ్స్థాయిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం ఇది దాదాపు రూ.37 లక్షల కోట్లు.
అది ఆర్బీఐ నిర్ణయం కాదు: ఆ కీలక ప్రతిపాదన నుండి శక్తికాంతదాస్ దూరం!
మారిషస్, సింగపూర్ల నుండి సగం..
డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) డేటా ప్రకారం భారత్లోకి 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 29 శాతం పెట్టుబడులు మారిషస్ నుండి వచ్చాయి. సింగపూర్ నుండి 21 శాతం, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ దేశాల నుండి 7 శాతం చొప్పున, యూకే నుండి 6 శాతం వచ్చాయి. మారిషస్ భార్కు 144.71 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుండి 106 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. అంటే ఈ రెండు దేశాల నుండే దాదాపు సగం వచ్చాయి. అలాగే, జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమాన్ ద్వీపాల నుండి కూడా భారీ పెట్టుబడులు వచ్చాయి.
2015-16 నుండి జంప్
ముఖ్యంగా 2015-16 నుండి FDIల రాక భారీగా పెరిగింది. అదే ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయి. అంతకుముందు ఏడాది కంటే ఇది 35 శాతం అధికం. 2016-17, 2017-18, 2018-19, 2019-20 ఈ నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 43.5 బిలియన్ డాలర్లు, 44.85 బిలియన్ డాలర్లు, 44.37 బిలియన్ డాలర్లు, 50 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ రంగల్లోకి పెట్టుబడుల వెల్లువ... అప్పటి నుండే
ప్రధానంగా కొన్ని రంగాల్లోకి ఎక్కువగా FDIలు వచ్చాయి. ఇందులో కంప్యూటర్ సాప్టువేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లోకి ఎక్కువగా వచ్చాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (FERA) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (FEMA) అమల్లోకి వచ్చాక FDIల ప్రవాహం పెరిగిందని నంగియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నిశ్చల్ అరోరా అన్నారు. 500 బిలియన్ డాలర్ల FDIలను క్రాస్ చేయడం గొప్ప మైలురాయి అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ వాహి అన్నారు.