డిసెంబర్లో 8 లక్షలు పెరిగిన ఉద్యోగాలు, 24 శాతం వృద్ధి
డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ఓలో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కావడం గమనార్హం. మిగతా 4.5 లక్షలమంది ఈపీఎఫ్ఓ నుండి వెళ్లి, తిరిగి వచ్చినవారు ఉన్నారు. 2019 డిసెంబర్ నెలతో పోలిస్తే 2020 డిసెంబర్ నెలలో సంఘటితరంగంలో 24 శాతం వృద్ధి నమోదయింది. అదే సమయంలో నవంబర్ నెలతో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో 53.70 లక్షలమంది నికర చందాదారులు ఈపీఎఫ్ఓలో చేరారు.
ఎవరు ఎంతమంది చేరారంటే
రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో చేరికల్లో 22 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర కార్మిక శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో చేరిన వారిలో వయస్సువారీగా చూస్తే డిసెంబర్ నెలలో 22 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య వయస్సువారు 3.36 లక్షలమంది, 18 నుండి 21 ఏళ్ల మధ్య వయస్సువారు 2.81 లక్షలమంది జత కలిశారు. మొత్తం చందాదారుల్లో 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వయస్సు కలిగిన వారు 49.19 శాతం మంది ఉన్నారు. వీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరినట్లుగా భావించవచ్చు.
ఈ రాష్ట్రాల్లో ఎక్కువ
ఈపీఎఫ్ఓ ప్రకారం మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నియామకాల్లో ముందున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే డిసెంబర్ నెలలో 29.12 లక్షలమంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఇక రంగాలవారీగా చూస్తే సర్వీస్ రంగంలో ఎక్కువమంది నియమించబడ్డారు. ఇందులోను ఎక్కువగా హ్యూమన్ రిసోర్సెస్ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు, ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ రంగం నుండి దాదాపు 27 లక్షలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
మహిళా నియామకాలు
ప్రధానంగా మ్యాన్పవర్ ఏజెన్సీస్, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీస్, స్మాల్ కాంట్రాక్టర్ల ద్వారా ఎక్కువ పేరోల్స్ జరిగాయి. జెండర్ వైస్ చూస్తే డిసెంబర్ 2020లో మహిళల నియామకాలు 22.76 శాతంగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో చేరిన 8.04 లక్షలమంది సబ్స్క్రైబర్లలో 1.83 లక్షలమంది మహిళలు. మహిళా నియామకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. నవంబర్ నెలలో మహిళా నియామకాలు 1.52 లక్షలమంది చేరారు.