ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: ఏడేళ్ల కనిష్టానికి పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు, రూ.700 కోట్ల మిగులు
ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గురువారం షాకిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరనికి గాను వడ్డీ రేటును ఏడేళ్ల కనిష్టానికి తగ్గించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ తాజాగా ఈపీఎఫ్ అకౌంట్పై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ మీడియాకు తెలిపారు.
ఏడేళ్ల కనిష్టానికి..
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించడంతో 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లపై ప్రభావం పడనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2016-17లోను 8.65 శాతంగా ఉంది. 2017-18లో దీనిని 8.55 శాతంగా ఉంది. 2015-16లో మాత్రం 8.8 శాతం వడ్డీ రేటు ఇచ్చింది. 2013-14, 2014-15 సంవత్సరాలలో 8.75 శాతం ఉంది. ఇప్పుడు 2012-13లో ఉన్న వడ్డీ రేటుకు (8.5 శాతం) తగ్గించింది. అంటే 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
రూ.700 కోట్ల మిగులు..
తాజా నిర్ణయంతో EPFOకు రూ.700 కోట్ల మిగులు ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. 8.55 శాతం వద్ద ఈ ఏడాది చివరి నాటికి ఈ రిటైర్మెంట్ ఫండ్ బాడీకి రూ.300 కోట్ల సర్ప్లస్ ఉంటుందని అంచనా. ఈపీఎఫ్ఓ 8.55 శాతాని కంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తే లోటు ఉండేదని అంటున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా..
ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును స్మాల్ సేవింగ్ స్కీంకు అనుగుణంగా సవరించాలని కార్మిక మంత్రిత్వ శాఖను కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎప్ అకౌంట్పై వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం.