అమెరికన్ మార్కెట్పై కన్నేసిన బైజూస్: 4 బిలియన్ డాలర్ల కోసం పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంటర్నెట్ స్టార్టప్, ఎడ్యుటెక్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ సంస్థగా గుర్తింపు పొందిన బైజూస్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తన వ్యాపార పరిధిని విస్తరించుకోనుంది. ఇందులో భాగంగా అమెరికాలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఒకట్రెండు అమెరికన్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే అవి కొలిక్కి రానున్నాయి. ఆ వెంటనే పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీగా
స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ రూపంలో అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడానికి బైజూస్ సన్నద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. మైఖెల్ క్లెయిన్కు చెందిన చర్చిల్ కేపిటల్స్ ఎస్పీఏసీతో చర్చలు కొనసాగిస్తోంది. కనీసం నాలుగు బిలియన్ డాలర్లను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అమెరికన్ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టడానికి చర్చిల్ కేపిటల్స్ ఎస్పీఏసీకి చెందిన బ్లాంక్ చెక్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదా విలీనం చేయడం అనే అంశాలను పరిశీలిస్తోంది.
మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా..
బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన స్టార్టప్ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్. 48 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ను సాధించింది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల మొత్తాన్ని పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం బైజూస్ యాజమాన్యం కొంతమంది బ్యాంకర్లు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో సంప్రదింపులు మొదలు పెట్టినట్టు ఇదివరకే వార్తలొచ్చాయి.
అమెరికా సహా..
ఫ్యూచర్ స్కూల్ ఆఫరింగ్ విధానంలో బైజూస్ ఇప్పటికే అమెరికాలో తన కార్యకలాపాలను చేపట్టింది. యూఎస్తో పాటు యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికోలకు వాటిని విస్తరించింది. తన పరిధిని నార్త్ అమెరికన్ మార్కెట్లో మరింత విస్తరింపజేసుకోవడంలో భాగంగా ఏకంగా.. అక్కడ పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి అనుగుణంగా- చర్చిల్ కేపిటల్స్తో సంప్రదింపులు సాగిస్తోంది.
ఎనిమిది కంపెనీల టేకోవర్..
బైజూస్ ఇప్పటికే ఎనిమిది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను టేకోవర్ చేసుకుంది. అమెరికాకు చెందిన టైంకె, డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్, కాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, గ్రేట్ లెర్నింగ్, గ్రేడ్ అప్ వంటి ఆన్లైన్ లెర్నింగ్ స్టార్టప్స్ను టేకోవర్ చేసింది. దీనికోసం రెండు బిలియన్ డాలర్లను వ్యయం చేసింది. మొత్తంగా 16.5 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్తో యునికార్న్గా కంపెనీగా బైజూస్ ఆవిర్భవించింది. ఆక్స్షాట్ కేపిటల్, ఎక్స్ఎన్ ఎక్స్పోనెంట్, ఈడెల్వీజ్, వెరిటియన్ మాస్టర్ ఫండ్, ఐఐఎఫ్ఎల్, టైమ్ కేపిటల్ అడ్వైజర్స్తో ఇన్వెస్ట్మెంట్పై చర్చలు సాగిస్తోంది.
భారత్లో ఎప్పుడు..
ఇదిలావుండగా.. భారత్లో కూడా బైజూస్ కంపెనీ యాజమాన్యం పబ్లిక్ ఇష్యూను జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. దీనికోసం కనీసం ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఎదురు చూడాల్సి రావొచ్చు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బైజూస్ స్టార్టప్ తన పబ్లిక్ ఇష్యూను జారీ చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. 3,000 కోట్ల రూపాయలు లేదా అంతకంటే అధిక మొత్తాన్ని సమీకరించేలా లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు రావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికన్ మార్కెట్లో లిస్టింగ్ తరువాతే ఇక్కడ ఐపీఓకు వస్తుందని అంటున్నారు.