lottery king: లాటరీ కింగ్ కు ED షాక్.. కొట్టేసింది, ఫ్రీజ్ చేసింది ఎంతంటే..
lottery king: లాటరీ కింగ్ గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది. తమిళనాడులో ఆయనకు చెందిన దాదాపు 158 కోట్ల విలువైన చరాస్తులను స్తంభింపజేసింది. సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి స్తంభింపజేసింది. కోయంబత్తూర్ మరియు చెన్నైలలో గత గురు, శుక్రవారాల్లో జరిపిన సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా ఈ చర్య తీసుకుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని నిబంధనల ప్రకారం మార్టిన్ ఆస్తులపై ED సోదాలు జరిపింది. ఇందులో భాగంగా చరాస్తులతో పాటు 299.16 కోట్ల విలువైన స్థిరాస్తుల పత్రాలను కూడా కేంద్ర ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. అంటే మొత్తంగా సుమారు 457 కోట్ల విలువైన ఆస్తులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వాటిని స్వాధీనం చేసుకోవడం లేదా స్తంభింపచేయడం జరిగినట్లు ED వెల్లడించింది.
కోయంబత్తూరులోని సిక్కిం లాటరీల మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఆఫీస్, శాంటియాగో మార్టిన్ నివాస ప్రాంగణాలు మరియు చెన్నైలోని ఆయన కుటుంబ సభ్యుల నివాస, వ్యాపార ప్రాంగణాల్లో సోదాలు జరిపినట్లు ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
సిక్కిం ప్రభుత్వ లాటరీలను అక్రమంగా కేరళలో విక్రయించడానికి సంబంధించి మార్టిన్ పై ED ఈ చర్యలు తీసుకుంది. IPCలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన పలు నేరాలకు సంబంధించి ఇప్పటికే CBI తుది నివేదిక ఇచ్చింది.
వాటి ఆధారంగా ఇప్పుడు కేంద్ర ఏజెన్సీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2009 నుంంచి ఆగస్టు 31, 2010 మధ్య మార్టిన్ సహా ఆయన అసోసియేట్ కంపనీలు ప్రైజ్-విన్నింగ్ టికెట్ల క్లెయిమ్స్ పెంచాయి. తద్వారా సిక్కిం ప్రభుత్వానికి నుంచి 910 కోట్ల మేర చట్ట విరుద్ధంగా లాభపడినట్లు దర్యాప్తులో తేలింది.