ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది, పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి రావడంపై నిర్మల ఏమన్నారంటే?
భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. రికవరీలో సరైన దారిలో ఉందన్నారు. జీఎస్టీ కలెక్షన్స్ పెరిగాయని, డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా పుంజుకున్నట్లు తెలిపారు. రిటైల్, స్మాల్ ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా కనిపిస్తున్నారని, దీంతో భారత స్టాక్ మార్కెట్ మరింతగా రాణించగలదని వ్యాఖ్యానించారు. స్పష్టమైన రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని, లేదంటే ఆదాయ వసూళ్లు ఇంతలా ఉండవన్నారు.
డైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వస్తే అర్ధ సంవత్సర లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామని, జీఎస్టీ వసూళ్లు సగటున నెలకు రూ.1.11 లక్షల కోట్ల నుండి రూ.1.12 లక్షల కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా రికవరీ దారిలో స్థిరంగా నడుస్తోందన్నారు. స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందన్నారు. లిస్టెడ్, సంబంధిత నిబంధనల్లో పారదర్శకత ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. అందుకే గతంలో మ్యూచువల్ ఫండ్స్ పైన మొగ్గు చూపే రిటైల్ ఇన్వెస్టర్లు, ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష మార్కెట్ పైన ఆసక్తి చూపిస్తున్నారన్నారు. డీమానిటైజేషన్ వల్ల నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగిందన్నారు.
జీఎస్టీ చట్టంలో పెట్రోల్, డీజిల్ ఇప్పటికే ఉన్నాయని, కాబట్టి వాటిని ఆ పరిధి కిందకు తీసుకురావడానికి ప్రత్యేకంగా అందులో సవరణ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయినా వీటిని పూర్తి జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం పరోక్ష పన్నుల అత్యున్నతస్థాయి మండలి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభుత్వం లక్ష్యమన్నారు.