జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 12 శాతం: యూబీఎస్ సెక్యూరిటీస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ క్వార్టర్)లో జీడీపీ వృద్ధి రేటు 12 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా వేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వృద్ధి రేటు మైనస్లలోకి వెళ్లిపోనుందని పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ల కారణంగా జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటుపై ప్రభావం పడుతోందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం కుదించుకుపోయింది. అయితే, ఆంక్షల ఎత్తివేతతో తర్వాత రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు పుంజుకుంది. దీంతో వి-షేప్ రికవరీ కనిపించింది.
అయితే ఈసారి 12 శాతం క్షీణత నుండి వి-షేప్ రికవరీకి అవకాశం లేదని యూబీఎస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఇంకా ఆందోళన నెలకొని ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. వారం ప్రాతిపదికన జూన్ 13వ తేదీతో ముగిసిన వారంలో 3 శాతం వృద్ధి నమోదయినప్పటికీ ఈ త్రైమాసికంలో 12 శాతం క్షీణత తప్పకపోవచ్చునని పేర్కొంది.