భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావం.. ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే?
గత ఏడాది కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సెకండ్ వేవ్ కూడా ప్రభావం చూపింది. ఉద్యోగాల కోత, వేతనాల కోత, వ్యాపారాలు జరగకపోవడం, నష్టం, పనులు దొరకకపోవడం.. ఇలా ఎన్నో ఇబ్బందులు కనిపించాయి. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఫస్ట్ వేవ్ కంటే తక్కువగా ఉంది. థర్డ్ వేవ్ ప్రభావం కూడా అంతగా ఉండదని నిపుణులు భావిస్తున్నారు.
సెకండ్ వేవ్ నుండి కోలుకుంటున్న భారత్లో ఆర్థిక రికవరీ కనిపిస్తోంది. ఉద్యోగాలు పెరుగుతున్నాయి. వ్యాపారాలు క్రమంగా పూర్వస్థితికి వస్తున్నాయి. అయితే థర్డ్ వేవ్ ఆందోళన మాత్రం అందరిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ థర్డ్ వేవ్ పైన స్పందించింది.
వేగవంతమైన రికవరీ
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు త్రైమాసికాల్లో భారత్ ఆర్ధిక వృద్ధి మరింత వేగవంతంగా ఉంటుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. జులై, ఆగస్ట్ నెలల్లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుకోవడంతో సత్వర వృద్ధి నమోదవుతుంందని అంచనా వేసింది. వైరస్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఆర్బీఐ, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తదుపరి మూడు త్రైమాసికాల్లో వేగవంతమైన రికవరీ సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవారీ రిపోర్ట్ ఆగస్ట్ నివేదికలో పేర్కొంది.
ముమ్మర వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనాను ఎదుర్కోవడంలో అనుభవం ద్వారా థర్డ్ వేవ్ వచ్చినా రికవరీపై అంత ప్రభావం చూపకపోవచ్చునని విశ్వాసం వ్యక్తం చేసింది. విద్యుత్ వినియోగం, రైల్వే సరుకు రవాణా, హైవే టోల్, జీఎస్టీ కలెక్షన్లు వంటి స్ధూల ఆర్థిక సంకేతాలు ఆర్థిక రికవరీ మెరుగ్గా ఉంటుందనేందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఆ రాష్ట్రాలపై ఆందోళన
కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు అధికంగా ఉండటం, పెరుగుతుండటంపై ఆర్థికమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో పాండమిక్ మేనేజ్మెంట్ అవసరమని తెలిపింది. 2020-21 ద్వితీయార్థంలో సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక రికవరీపై ప్రభావం పడిందని, అయితే FY21, FY22 మొదటి ఆర్థిక సంవత్సరంలో వ్యాక్సినేషన్ వేగవంతమైన విషయాన్ని గుర్తు చేసింది.
FY22 మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 20 శాతం పెరిగిందని గుర్తు చేసింది. సెకండ్ వేవ్ కనిపించినప్పటికీ ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీని కనబరుస్తోందని తెలిపింది. రంగాల వారీగా చూస్తే వ్యవసాయ రంగం బలమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపింది. ఉత్పాదక, నిర్మాణ రంగం కూడా వేగంగా రికవరీ అవుతుందని తెలిపింది.
ప్రభుత్వ చర్యలు ఉత్తేజం
కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవల రంగం రికవరీ అలాగే ఉన్నప్పటికీ, ప్రభుత్వ సహాయక చర్యలు ఒత్తిడిలోని వివిధ రంగాలకు ప్రయోజనం కల్పిస్తాయని పేర్కొంది. రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి, ట్రాక్టర్ సేల్స్ పెరగడం వంటి అంశాలు గ్రామీణ డిమాండును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని తెలిపింది. జూన్ నెలలో ఐఐపీ మంచి వృద్ధిని నమోదు చేసిందని, పరిశ్రమ స్థిరంగా 2019 జూన్ నాటి అంటే కరోనా ముందుస్థాయిలో 95 శాతానికి చేరుకుంటోందని పేర్కొంది.
జూలై నెలలో ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచీ వార్షిక ప్రాతిపదికన 9.4 శాతం పెరిగింది. ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు మినహా అన్ని రంగాలు కరోనా ముందుస్థాయికి చేరుకోవడం లేదా అధిగమించడం జరిగిందని తెలిపింది. విద్యుత్ వినియోగం, రైలు సరుకు రవాణా, హైవే టోల్ కలెక్షన్లు, ఈ-వే బిల్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్, బలమైన జీఎస్టీ సేకరణలలో వేగవంత రికవరీ కనిపిస్తోందని తెలిపింది.