అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు షాక్: ప్రోడక్ట్ ధరలు తగ్గించొద్దు
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు భారీ షాక్. తమ మార్కెట్ ప్లేస్ లో ఇష్టమొచ్చినట్లు ప్రోడక్ట్ ల ధరలు తగ్గించటం ఇకపై కుదరక పోవచ్చు. ఈకామెర్స్ కంపెనీలు అంటేనే విపరీతమైన ఆఫర్ల తో వినియోగదారులను ఆకర్షించి భారీ అమ్మకాలను పోగేసుకొంటాయి. దీంతో చిన్న తరహా ఆఫ్-లైన్ రిటైలర్లను భారీగా నష్టపోతున్నారు. అమ్మకాలు లేకపోవటంతో వ్యాపారాలు కొనసాగించలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ - ఆఫ్ లైన్ అని తేడా లేకుండా అందరికి ఒకే తరహా నిబంధనలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించే దిశగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈకామెర్స్ కంపెనీలకు కొత్త నిబంధనలు అమలు చేసే దిశగా డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ రూపొందించింది. ఇవి అమల్లోకి వస్తే ఇకముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి బడా ఈ కామర్స్ కంపెనీలు ప్రొడక్టుల ధరలు అమాంతం తగ్గించేందుకు వీలుపడదు. తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ప్రొడెక్టును ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలో తేల్చుకొనే అవకాశం లభిస్తుంది. ఇది కొంత వరకు దెబ్బ తిన్న ఆఫ్ లైన్ రిటైలర్లకు మళ్ళీ వ్యాపారం పుంజుకొని అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు.
అమ్మో అమెరికన్ చికెన్ లెగ్స్.. వస్తే పరిస్థితి ఏమవుతుందో?
ప్రత్యక్షం... లేదా పరోక్షంగా కూడా కుదరకు...
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిబంధనలు అమలు చేసినా... ఈ కామర్స్ కంపెనీలు వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. నిబంధనల్లోని లూప్ హోల్స్ తో పరోక్షంగా ప్రొడక్టుల ధరలు తగ్గిస్తున్నాయి. తద్వారా పెద్ద ఎత్తున వినియోగదారులను తమ వెబ్ సైట్ లకు ఆకర్షించగలుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న నిబంధనలు అమల్లోకి వస్తే మాత్రం.... ఈ కామర్స్ కంపెనీలు పరోక్షంగా కూడా తమ మార్కెట్ ప్లేస్ ల్లో లభించే ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేయరాదు.
అంటే వాటి ధరలను ఇష్టమొచ్చినట్లు ఎంత పడితే అంత తగ్గించరాదు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ (ఈ కామర్స్ )రూల్స్, 2019 పేరుతొ రూపొందించిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని ఇప్పటికే కేంద్రం ప్రజల అభిప్రాయాల సేకరణ నిమిత్తం జారీ చేసింది. డిసెంబర్ 2 వరకు ఈ మార్గ నిర్దేశకాలపై అభిప్రాయాలను తెలుపవచ్చు.
మంచి నిర్ణయం...
కాగా ఈ సరికొత్త మార్గ నిర్దేశకాలను దేశ వ్యాప్త వ్యాపారుల సంఘం సమర్థించింది. ఈ గైడ్ లైన్స్ ను స్వాగతించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి)... దీంతోనైనా ఈ కామర్స్ కంపెనీలు నిబంధనలు పాటిస్తామని, అలాగే వినియోగదారుల హక్కుల కు బాధ్యత వహిస్తాయని భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. గత ఐదారేళ్లుగా దేశంలో ఈ కామర్స్ రంగం బాగా ఊపందుకొంది. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ సేవలు అందించటం, ఇంటి పక్కనే ఉండే షాప్ లో దొరికే ధరకంటే కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండటంతో వినియోగదారులు అటు వైపు మళ్లారు. కానీ ఈ క్రమంలో లోకల్ షాప్స్ బాగా దెబ్బతిన్నాయి. లాభాల ఆర్జన కంటే కూడా కేవలం వినియోగదారులను ఆకర్షించటమే పనిగా పెట్టుకొన్న ఈ కామర్స్ కంపెనీలకు ఇది బాగా కలిసొచ్చింది. అమ్మకాలు బాగా పెరిగాయి. కానీ నష్టాలు అంతకంటే అధికంగా వస్తున్నాయి. అయినా అవి లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ట్రేడర్లు ఆందోళన బాట పట్టారు.
రివ్యూ లపైనా కన్ను...
ప్రస్తుతం ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా ... సేవలు పొందాలన్న వినియోగదారులు రివ్యూస్ పైనే ఆధారపడుతున్నారు. అదే అదునుగా కొన్ని కంపెనీలు నీకిలీ రివ్యూస్ తో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఈ కామర్స్ కంపెనీల్లో జరిగే మరిన్ని మోసాలపై కూడా కొత్త గైడ్ లైన్ దృష్టి సారించనున్నాయి. ఉత్పత్తి ఎలా ఉన్నా... అది చాలా మంచి ప్రొడెక్టు అని, ఈ కామర్స్ కంపెనీయే స్వయంగా కొన్ని నకిలీ రివ్యూస్ సృష్టించటాన్ని కూడా కేంద్రం గుర్తించింది. అందుకే, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. ప్రొడక్టుల నాణ్యత, ఫీచర్స్ ను ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపటం కూడా నేరమే.
సెల్లెర్స్ డీటెయిల్స్...
ఇప్పటి వరకు ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో కొనుగోలు చేసే ప్రొడక్టులను విక్రయించే సెల్లర్ వివరాలు సరిగ్గా పేర్కొనటం లేదు. కానీ ఇకపై అలా కుదరదు. తప్పనిసరిగా అమ్మకందారు పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, అతను విక్రయించే ప్రొడక్టుల వివరాలు సైతం ప్రదర్శించాల్సి ఉంటుంది. వ్యాపారంలో నెలకొన్న విపరీతమైన పోటీ వల్ల ఇప్పటివరకు ఈ కామర్స్ కంపెనీలు దీనిని అమలు చేయలేదు. కానీ ఇకపై తప్పకపోవచ్చు. లేదంటే వాటిపై కఠిన చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. లేదా వినియోగదారులు కూడా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు.