రూ.20 వేల కోట్లకు పైగా సేల్స్: నాలుగు రోజుల్లో కళ్లు చెదిరే అమ్మకాలు
ముంబై: పండగల సీజన్ వచ్చిందంటే ఇదివరకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాంటివి ప్రత్యక్షమౌతుంటాయి. దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దుస్తుల కొనుగోళ్లు దుమ్ములేపుతుంటాయి. హోమ్ అప్లయన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్, గ్యాడ్జెట్స్ విస్తృతంగా అమ్ముడవుతుంటాయి. ప్రత్యేకించి దసరా-దీపావళి సమయాన్ని అతి పెద్ద వ్యాపార సీజన్గా భావిస్తుంటాయి మార్కెట్ వర్గాలు. ఈ సీజన్లో అందుబాటులోకి వచ్చే ఆఫర్ల కోసం కొనుగోలుదారులు కూడా ఎదురు చూస్తుంటారు. తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూంటారు.
ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత పరిస్థితి మారింది. వన్ ప్లస్ వన్ వంటి ఆఫర్లతో పాటు భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసినా వాటి మీద భారీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తుంటాయి ఇ-కామర్స్ కంపెనీలు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింట్రా వంటి ప్లాట్ఫామ్స్ కళ్లు చెదిరే ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొవచ్చాయి. ఫెస్టివ్ సీజన్ పేరుతో ఆఫర్లను ప్రకటించాయి.
ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు కూడా ఉంటున్నాయి. తొలి నాలుగు రోజుల వ్యవధిలో 20,000 కోట్ల రూపాయల మేర సేల్స్ను సాధించాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి నాలుగు రోజుల్లో 2.7 బిలియన్ డాలర్ల బిజినెస్ నమోదైనట్లు బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ రెడ్సీర్ కన్సల్టింగ్ తెలిపింది. ఈ ఫెస్టివ్ సీజన్ ముగిసే సమయానికి గ్రాస్ మర్కండైజ్ వాల్యూమ్ అనేది 36,000 కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా వేసింది.
మరో 21 వేల కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదు కావచ్చిన పేర్కొంది. వారం రోజుల పాటు ఇ-కామర్స్ కంపెనీలు ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ సేల్స్లల్లో 63 శాతం మేర పురోభివృద్ధి కనిపించినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రకటించిన ఫెస్టివ్ సేల్స్త పోల్చుకుంటే ఇది ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. గత సంవత్సరం ఇదే సమయానికి నమోదైన సేల్స్ వాల్యూమ్ 57 శాతం. తాజాగా రికార్డయిన్ సేల్స్లో 50 శాతం వాటా స్మార్ట్ఫోన్లదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుందని రెడ్సీర్ పేర్కొంది.