నిధుల వేటలో డాంజో ... రూ 225 కోట్ల సమీకరణ!
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న హైపర్ లోకల్ డెలివరీ సంస్థ డాంజో .... నిధుల వేటలో పడింది. తాజాగా మరో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాలని ప్రయత్నిస్తున్నలు సమాచారం. అంటే సుమారు రూ 225 కోట్ల నిధులు ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని యోచిస్తోంది. ఈ మేరకు డాంజో లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అదే జరిగితే దాదాపు 9-10 నెలల తర్వాత మళ్ళీ ఈ స్టార్టుప్ కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవహించనున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డాంజోలో గతంలోనే గూగుల్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.
దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. అప్పటి నుంచి కంపెనీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ, కొంత కాలంగా కంపెనీ మరోసారి పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా... ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అది కాస్త ఆలస్యం అయినట్లు సమాచారం. కానీ, ప్రస్తుతం నిధుల సమీకరణ ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనంలో పేర్కొంది.
రోజుకు రూ.800కు పైగా పెరుగుదల: పసిడి ర్యాలీ కొనసాగుతుందా అంటే?
గూగుల్ కూడా...
గూగుల్ ఇప్పటికే డాంజో లో భారీ పెట్టుబడి పెట్టింది. 2019 అక్టోబర్ లో కూడా మరోసారి గూగుల్ 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ 75 కోట్లు) పెట్టుబడి పెట్టింది. మళ్ళీ ప్రస్తుత రౌండ్ లో కూడ గూగుల్ పాల్గొంటున్నట్లు సమాచారం. 2019 లో డాంజో 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 337 కోట్లు) ఇన్వెస్ట్మెంట్ రాబట్టింది. ఇందులో లైట్ బాక్స్ ఒక్కటే 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా ... ఎస్ టి ఐ సి అనే మరో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమకూర్చింది. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీల తోడు ఉండటంతో డాంజో కు నిధుల సమీకరణ పెద్ద కష్టం కావటం లేదు. కానీ గత ఏడాది కాలంగా మాత్రం కాస్త ఆలస్యం అయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రూ 407 కోట్ల నష్టం...
వినియోగదారులకు సత్వరమే డెలివరీ సేవలు అందించే విభాగంలో పనిచేస్తున్న డాంజో... మార్కెట్లో భారీగా విస్తరించినప్పటికీ నష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా డెలివరీ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ ను పూరించేందుకు చాలా సంస్థలతో డాంజో జట్టు కట్టింది. ఇదిలా ఉండగా... 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ 407 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతక్రితం ఏడాదిలో కంపెనీ నష్టం రూ 178 కోట్లతో పోల్చితే ఇది 2.3 రెట్లు అధికం కావటం గమనార్హం. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ 16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా... అది 2019-20 సంవత్సరానికి రూ 71 కోట్లకు పెరగటం విశేషం. కానీ, ఆదాయానికి, ఖర్చులకు భారీ వ్యత్యాసం ఉంటోంది. సగటున నెలకు రూ 30 కోట్ల నష్టాలను కంపెనీ చవిచూస్తోంది.
200 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్...
లాజిస్టిక్స్ సేవల రంగంలో ... అది కూడా లోకల్ డెలివరీ సేవల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న డాంజో... ఇటీవల వేగంగా డెలివరీ సేవలు అందించేందుకు డార్క్ స్టోర్ల ను కూడా ఏర్పాటు చేసింది. బెంగళూరు సహా మరిన్ని పెద్ద నగరాల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. పెద్ద పెద్ద సంస్థలతోనూ జట్టు కడుతూ వారికి సంబంధించిన డెలివరీ సేవలు అందిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమీకరించబోయే నిధులతో డాంజో వాల్యుయేషన్ సుమారు 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 1,500 కోట్లు) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2014 జులై లో ఏర్పాటైన డాంజో ... ప్రస్తుతం సగటున నెలకు 10 లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. పెట్టుబడులు పెరిగితే కంపెనీ మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.