Petrol prices: 4 రోజుల్లో డీజిల్ 70 పైసలు జంప్, పెరిగిన పెట్రోల్ ధర
కొద్ది నెలల తర్వాత పెట్రోల్ ధరలు నేడు (మంగళవారం, సెప్టెంబర్ 28) పెరిగాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 19 పైసల నుండి 25 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు గతవారం రోజుల్లో నాలుగోసారి పెరిగాయి. నేడు డీజిల్ ధర లీటర్ పైన 24 పైసల నుండి 27 పైసలు పెరిగింది. ఇరవై మూడు రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు తగ్గింది. లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గింది.
నాటి నుండి పెట్రోల్ ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి పెరిగింది మాత్రం జూలై 17వ తేదీ. డీజిల్ ఇటీవల తగ్గుతున్నాయి. ఈ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు అక్కడ పెరుగుతుండటంతో ఇక్కడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్లో ఇప్పటి వరకు డీజిల్ నాలుగుసార్లు, పెట్రోల్ ఒకసారి పెరిగింది. డీజిల్ ధర నాలుగు రోజుల్లో 70 పైసలు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.39, లీటర్ డీజిల్ రూ.89.57గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.47, డీజిల్ రూ.97.21గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.15, డీజిల్ రూ.94.17, కోల్కతాలో పెట్రోల్ రూ.101.87, డీజిల్ రూ.92.67, హైదరాబాద్లో పెట్రోల్ రూ.105.48, డీజిల్ రూ.97.46గా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీ మార్కెట్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్కు 75.80 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ ధర 79.85 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి.
కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1న పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ధరలను సవరించాయి. నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు రూ.25 పెంచాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు రూ.884.50కు పెరిగింది. గత రెండు వారాల్లో ఇది రెండో పెరుగుదల. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన సవరిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, తద్వారా వినియోగదారులపై భారంలేకుండా చూడాలని అనుకుంటోందని, కానీ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇటీవల అన్నారు. 'మీరు(మోడీ ప్రభుత్వం) పెట్రోల్ ధరలు తగ్గించాలని భావిస్తున్నారా అంటే, నేను అవును అంటాను. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు అని అడిగితే మాత్రం రాష్ట్రాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకే తగ్గడం లేదు' అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కేంద్రానికి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.32 ఎక్సైజ్ డ్యూటీ వస్తోందని, ఇందులో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పన్ను ద్వారా వచ్చే రూ.32తో ఉచిత రేషన్, ఉచిత హౌసింగ్, ఉజ్వల వంటి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నామన్నారు.