ఒక్క పైస అదనపు ట్యాక్స్ వేయలేదు, ఆంక్షల తొలగింపుతో రికవరీ: నిర్మల సీతారామన్
కరోనా మహమ్మారి సమయంలో ఏ ఒక్కరి నుండి కూడా అదనంగా సింగిల్ పైసా కూడా అదనంగా వసూలు చేయడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల పైన ఎలాంటి అదనపు పన్నులు విధించడం లేదన్నార. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) వార్షిక సదస్సులో నిర్మలమ్మ మాట్లాడారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లిస్తామన్నారు. కరోనా నియంత్రణకు అదనంగా పన్ను చెల్లించాలని తమ ప్రభుత్వం కోరడం లేదని చెప్పారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను లేదా పరిశ్రమలను.. ఇలా ఎవరిని అదనపు పన్ను అడగడం లేదని స్పష్టం చేశారు.
ఒక్క పైస తీసుకోలేదు
'నాకు చెప్పే ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ, ప్రస్తుతం దీనిని చెప్పాలని అనుకుంటున్నాను. కోవిడ్ కోసం చేసే ఖర్చు లేదా ఆర్థిక సాయం కోసం కోవిడ్ పన్ను వేయలేదు. కరోనాను కట్టడి చేసేందుకు అదనంగా ఒక్క పైసను కూడా వ్యక్తిగత పన్నుదారులను లేదా పరిశ్రమను అడగడం లేదు. కరోనా కట్టడి కోసం ఎవరి నుండి ఒక్క పైస తీసుకోలేదు' అని సీఐఐ సదస్సులో నిర్మలా సీతారామన్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై...
పెట్రోల్, డీజిల్లపై ట్యాక్స్లు, సెస్ల పైన కూడా నిర్మలా సీతారామన్ స్పందించారు. అయితే నేరుగా స్పందించలేదు. పరోక్షంగా ఈ అంశంపై మాట్లాడారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఇంధనరంగంలో స్వయం సమ్రుద్ధి సాధించకపోతే పెట్రోలియం ఉత్పత్తుల కోసం భారీగా చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్భణం గురించి స్పందిస్తూ... ఇది 6 శాతాన్ని దాటడానికి సీజనల్ అంశాలు కారణమన్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ల కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదన్నారు. ప్రజలపై ప్రత్యక్ష పన్నుల భారం మోపుతున్నట్లు చెప్పడం సరికాదన్నారు.
ఆర్థిక రికవరీ
రాష్ట్రాలలో కరోనా కట్టడికి సంబంధించి ఆంక్షలను తొలగిస్తున్నా కొద్దీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, రికవరీ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని నిర్మలమ్మ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 37% పెరిగినట్లు తెలిపారు. జులై నాటికి విదేశీ మారక నిల్వలు 620 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు.
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోను సంస్కరణలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇందుకు అనుగుణంగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇన్వెస్ట్ చేసేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. 2021-22 బడ్జెట్లో నిర్దేశించిన ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆదాయపు పన్ను, జీఎస్టీ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారని, లొసుగులను పూడ్చడం ద్వారా ఆదాయాలు పెరిగేందుకు దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రాలకు జీఎస్టీ డబ్బులు మొత్తం చెల్లిస్తామని, తద్వారా అభివృద్ధి పనులకు చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పారు.
రిస్క్ సామర్థ్య ప్రదర్శన
భారత్లోకి పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడేందుకు రిస్క్ సామర్థ్యాన్ని కనబరచాలని నిర్మలమ్మ పరిశ్రమకు సూచించారు. తమ వ్యాపారాలను విస్తరించాలని, ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కావాలని హితవు పలికారు. పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసేందుకు ముడి పదార్థాలు, పరికరాల తయారీ వ్యాపారంపైన దృష్టి సారించాలన్నారు. తద్వారా శిలాజ ఇంధనంపై భారత్ దిగుమతులపై ఆదారపడటం తగ్గుతుందని చెప్పారు.