ఆన్లైన్ బోధన: లైవ్ క్లాస్రూం టీచింగ్ ప్రారంభించిన అంబానీ స్కూల్
ఇండియా ప్రముఖ ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) ఈ రోజు (మార్చి 26) తన విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఉపాధ్యాయులు వీడియో ద్వారా విద్యార్థులకు బోధన చేశారు. రిలయన్స్ జియో అందిస్తోన్ బ్రాడ్బాండ్ విడ్త్, కనెక్టివిటీతో ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు మైక్రోసాఫ్ట్ టీమ్ను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు.
ఆన్లైన్ బోధన కోసం టీచర్ల మధ్య సమన్వయం కూడా చేస్తున్నారు. ఆన్లైన్ క్లాస్ల కోసం వైట్ బోర్డ్ ప్లాట్ఫాంను ఉపయోగిస్తోంది. ఆన్లైన్ విద్యాబోధన ఈ రోజు 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా ప్రారంభించారు. ఈ తరహా బోధనను రానున్న నాలుగైదు రోజుల్లో అన్ని తరగతులకు విస్తరిస్తారు.
షెడ్యూల్ ప్రకారం 13-25 సెలవుల అనంతరం ఈ రోజు స్కూల్ పునఃప్రారంభమైంది. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు పాఠశాల అన్ని తరగతి గదులను ఇందుకు అనుగుణంగా మార్చివేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు తమ సొంత ఇళ్ల నుండి ఆన్లైన్ శిక్షణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా DAIS ఫౌండర్ అండ్ చైర్పర్సన్ నీతా అంబానీ మాట్లాడారు. దేశాల్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో కొత్త విద్యావిధానం ప్రారంభించామని, ఆరోగ్యం, భద్రత అందరికీ ముఖ్యమని ఆమె అన్నారు. ఈ మహమ్మారి బిలియన్కు పైగా విద్యార్థులపై ప్రభావం చూపిందన్నారు. ఇండియా 21 రోజుల లాక్డౌన్లో ఉందని, అందరు క్షేమంగా ఉండాలని, తమ ఇంటర్నేషనల్ స్కూల్ సంపూర్ణ ఆరోగ్యానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. మా స్కూల్ మూసివేసినా, వర్చువల్ స్కూల్ ప్లాట్ ఫాం ద్వారా బోధిస్తామన్నారు. తద్వారా పిల్లలు భద్రతతో పాటు చదువును పొందుతారన్నారు. పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు, భద్రత తప్ప మరేదీ ముఖ్యం కాదన్నారు. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామన్నారు.