Pfizer: అప్పుడే థర్డ్ డోస్ కూడా రెడీ: వినియోగానికి అనుమతి కోరడమే: ఇమ్యూనిటీ బూస్ట్
వాషింగ్టన్: కరోనా వైరస్ తీవ్రత ప్రపంచాన్ని ఇంకా వీడిపోవట్లేదు. సరికొత్త రూపాన్ని సంతరించుకుంటూ భయపెడుతోంది. ఇదివరకు బ్రిటన్ వేరియంట్ అంటూ భయాందోళనలకు గురి చేసిన కరోనా మహమ్మారి.. తాజాగా డెల్టా ప్లస్ మ్యూటెంట్తో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. భారత్ సహా అనేక దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నాయి. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదు జపాన్.
ఈ పరిస్థితుల మధ్య డెల్టా ప్లస్ వేరియంట్పైనా ప్రభావం చూపుతుందని భావిస్తోన్న ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్.. థర్డ్ డోస్ త్వరలో అమెరికాలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిద్ధపడింది. దీనికి అనుమతి ఇవ్వాలని ఫైజర్, బయోఎన్టెక్ త్వరలో దరఖాస్తులను దాఖలు చేయనున్నాయి. ఈ విషయాన్ని ఈ రెండు సంస్థలు తాజాగా ప్రకటించాయి. మూడో డోసుగా తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డెల్టా వేరియంట్పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపాయి. 12 నెలల్లోగా మూడో డోసు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని స్పష్టం చేశాయి.
రెండు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి శరీరంలో వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన యాంటీబాడీస్ విస్తృతంగా వృద్ధి చెందుతాయని, ఇక 12 నెలల్లోపల మూడో డోసు ఇంజెక్షన్ కూడా వేసుకోవడం ఇమ్యూనిటీ బలపడుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి క్లినికల్ డేటాను తాము యూఎస్ఎఫ్డీఏకు సమర్పించినట్లు ఫైజర్ తెలిపింది. మూడో డోసు వ్యాక్సిన్తో యాంటీబాడీస్ అయిదు నుంచి 10 రెట్ల మేరకు వృద్ధి చెందుతాయని ఫైజర్ ప్రతినిధి మైఖెల్ డోల్స్టన్ తెలిపారు. ఆగస్టులో ఈ దరఖాస్తులను దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.