Delhivery, Venus Pipes: లిస్టింగ్ డే నాడే అదరగొట్టే రిటర్న్స్: భారీ లాభాలు పంచిన ఐపీఓలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఇవ్వాళ రెండు పబ్లిక్ ఇష్యూలో లిస్టెడ్ అయ్యాయి. తొలి రోజు, తొలిగంటలోనే లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇన్వెస్టర్లకు గుడ్ రిటర్న్స్ అందించాయి. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టాలతో ప్రారంభమైనప్పటికీ- ఈ రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు మాత్రం అదరగొట్టాయి. ప్రముఖ లాజిస్టిక్ సొల్యూషన్స్ కంపెనీ డెలివరీ, వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన షేర్లు కొద్దిసేపటి కిందటే బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో లిస్టింగ్ అయ్యాయి.
అదరగొట్టిన వీనస్..
లిస్టింగ్ అయిన వెంటనే 28 రూపాయల మేర లాభంలోకి దూసుకెళ్లింది వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ షేర్ ధర. ఈ కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ310-326 రూపాయలు కాగా.. లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే 345 రూపాయల వరకు వెళ్లింది. ఆ కొద్దిసేపటికే 350 రూపాయల మార్క్ను కూడా దాటేసింది. 354 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. తొలి గంటలోనే ఈ షేర్ మంచి రిటర్న్న్ను ఇన్వెస్టర్లకు అందించినట్టయింది.
డెలివరీ లాభాలతో..
డెలివరీ ఐపీఓ లిస్టింగ్.. దీనికి భిన్నంగా సాగింది. లిస్టింగ్ అయిన వెంటనే ఈ కంపెనీ ఇచ్చిన రిటర్న్న్ నామమాత్రమే. 1.5 శాతం మాత్రమే ప్రీమియం అయింది. డెలివరీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.462 నుంచి 487 రూపాయలు. కాగా 490 రూపాయలలోపు లిస్టింగ్ అయింది. ఒక దశలో దీని షేర్ ధర 485 రూపాయలకు సైతం తగ్గింది. మైనస్లోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది. ఒక్కసారిగా అప్పర్ సర్కుట్లోకి ట్రేడ్ అయింది.
50 రూపాయల బెనిఫిట్..
అంతకంతకూ దీని షేర్ ధర పెరుగుతూ వెళ్లింది. తొలి గంట ముగిసే సమయానికి 10 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది. 487 రూపాయలు ఉన్న డెలివరీ షేర్ ధర 543 రూపాయలను తాకింది. అనంతరం కొద్దిగా క్షీణించి.. 534 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. డెలివరీ 10 శాతం, వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఎనిమిది శాతం వరకు రిటర్న్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. వీటి ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
నష్టాలతో మార్కెట్
కాగా- ఇవ్వాళ మార్కెట్స్ స్వల్పంగా నష్టాలతో ఆరంభం అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లోయర్ సర్క్యుట్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 190 పాయింట్ల మేర నష్టంతో ప్రారంభమైంది. ఆ తరువాత కొద్దిగా పుంజుకొంది. తన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకోగలిగింది. నిఫ్టీ 16,200 పాయింట్ల కంటే దిగువకు ట్రేడ్ అయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఐటీ, ఫార్మాసూటికల్స్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు స్వల్పంగా నష్టపోతూ కనిపించాయి.