బిగ్బజార్-రిలయన్స్ రిటైల్..మధ్యలో అమెజాన్: రూ.24,713 కోట్ల మెగా డీల్: ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలో దూసుకెళ్తోన్న రిలయన్స్ రిటైల్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫ్యూచర్ రిటైల్తో విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలపై అమెజాన్ సంస్థ వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల నేపథ్యంలో.. ఈ మెగా మెర్జింగ్ కాస్తా ఢిల్లీ హైకోర్టు గడప తొక్కింది. కిందటి నెల 21వ తేదీన సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెజాన్ సంస్థ దాఖలు చేసిన అప్పీల్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాదోపవాదాలను విన్న తరువాత..ఫ్యూచర్, రిలయన్స్ రిటైల్కు నోటీసులను జారీ చేసింది. తుదపరి విచారణను వచ్చేనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వెంచర్లను విక్రయించడానికి సాగుతోన్న ప్రయత్నాల పట్ల అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మెగా డీల్ విలువ 24,713 కోట్ల రూపాయలు. ఈ డీల్ పట్ల అమెజాన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు. బిగ్ బజార్ను నిర్వహిస్తోన్న ఫ్యూచర్ రిటైల్ వెంచర్లో అమెజాన్కు అయిదు శాతం పరోక్ష పెట్టుబడులు ఉన్నాయి. పరోక్ష పెట్టుబడులను పెట్టే సమయంలో ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా ఈ మెగా విలీనం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అప్పట్లో ఫ్యూచర్-అమెజాన్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. కాల పరిమితి ముగిసే వరకు ఫ్యూచర్ రిటైల్ వెంచర్.. స్వతంత్రంగా కొనసాగాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఫ్యూచర్ రిటైల్ వెంచర్ అధినేత కిశోర్ బియానీ.. రిలయన్స్తో విలీన ప్రతిపాదనలను తెర మీదికి తీసకుని రావడాన్ని అమెజాన్ తప్పు పడుతోంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇదివరకు సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమెజాన్ సంస్థ అప్పీల్కు వెళ్లింది. ఢిల్లీ హైకోర్టులో ప్రత్యేకంగా మరో పిటీషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఫ్యూచర్, రిలయన్స్ రిటైల్ వెంచర్కు నోటీసులను పంపించింది.