ఉద్యోగులకు శుభవార్త: 3% శాతం కంటే ఎక్కువగా పెరిగిన డీఏ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)ను 3.144 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రాస్ శాలరీలో డీఏ 30.392 శాతంగా ఉంది. అయితే దీనిని 33.536 శాతానికి పెంచారు. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి చెల్లిస్తున్నట్లు జీవోలో తెలిపారు.
భారత్లోనే కాదు... గోల్డ్ జ్యువెల్లరీ అంతటా అదే పరిస్థితి
జీపీఎఫ్లో జమ చేస్తారు
డిసెంబర్ 1వ తేదీన చెల్లించే నవంబర్ వేతనంతో పాటు పెంచిన డీఏను ప్రభుత్వం చెల్లిస్తుంది. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు డిఏ బకాయిలను సాధారణ భవిష్య నిధి (GPF) ఖాతాలో జమ చేస్తారు. అంటే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలును జమ చేస్తుంది. స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుంది.
వారికి నగదు రూపంలో..
2020 ఫిబ్రవరి 29వ తేదీకి ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది.
సీపీఎస్ వర్తించే ఉద్యోగులకు...
2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నియమించబడి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (CPS) వర్తించే ఉద్యోగులకు 1 జనవరి 2019 నుంచి 31 అక్టోబర్ 2019 మధ్య కాలానికి సంబంధించి పెరిగిన డీఏ బకాయిల్లో పది శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ చేస్తుంది. మిగతా 90 శాతం డీఏ బకాయిల్ని డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైమ్ కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిల్ని డిసెంబర్ నెలలో నగదు రూపంలో చెల్లిస్తుంది.