ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్: డీఏ, డీఆర్ పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్. ఉద్యోగుల డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ను మూడు శాతం మేరకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపు 34 శాతానికి చేరుకుంటుంది. ఈ పెంపు జనవరి 2022 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఇంధనం, చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం నేపథ్యంలో దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరుతుంది. డీఏ పెంపు, డీఆర్ పెంపు కారణంగా ఖజానా పైన అదనంగా రూ.9,544.50 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ, డీఆర్లను సవరిస్తుంది. జనవరి, జూలై నెలలో ఉంటుంది.
అయితే ఈ డీఏ, డీఆర్ పెంపు ఉద్యోగి ఎక్కడ ఉన్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ, డీఆర్లలో ఎలాంటి మార్పులేదు. కానీ జూలై 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 17 శాతంగా ఉన్న డీఏ, డీఆర్లను 28 శాతానికి పెంచింది. అక్టోబర్ 2021లో ఇది మరో మూడు శాతం పెరిగి 31 శాతానికి చేరింది. ఇప్పుడు మరో మూడు శాతం పెరగడంతో 34 శాతమైంది. ఉద్యోగి మూలవేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా లెక్కిస్తారు.