ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద డేటా లీక్, మొబిక్విక్ ఏం చెప్పిందంటే?
పేమెంట్ యాప్ మొబిక్విక్కు చెందిన 35 లక్షలమంది యూజర్ల డేటా బయటకు పొక్కినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ డేటా బ్రీచ్ అతిపెద్ద కేవైసీ లీక్గా భావిస్తున్నారు. 35 లక్షల మంది యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. వీరికి చెందిన సున్నితమైన సమాచారం లీక్ అయినట్లుగా సెక్యూరిటీ రీసెర్చర్ చెబుతున్నారు. లీక్ అయిన సమాచారంలో యూజర్ల కేవైసీ వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ వివరాలు లీక్
పేమెంట్ యాప్ మొబిక్విక్ కీలక డేటా బయటకు పొక్కడంతో, దాదాపు 8.2 టెరాబైట్ల డేటా ఆన్లైన్లో విక్రయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేవైసీ వివరాలు, ఫోన్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలు డార్క్ వెబ్లో ఉంచారు. మొత్తం 3.5 మిలియన్ల డేటా ఉందని సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా ఫిబ్రవరి నెలలో పేర్కొన్నారు. సోమవారం ఒక లింక్ డార్క్ వెబ్లో వైరల్గా మారింది. దీనిని పరిశీలించిన చాలామంది యూజర్లు తమ వివరాలను అందులో గుర్తించారు.
84వేల డాలర్లకు విక్రయం
చాలామంది స్క్రీన్ షాట్స్ను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ డేటాలో పాస్వర్డ్స్ మాత్రం ఎన్క్రిప్టెడ్ రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం డేటాని 1.5 బిట్ కాయిన్కు విక్రయించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇది 84,000 డాలర్లు. భారత హిస్టరీలోనే ఇది అతిపెద్ద డేటా లీక్గా చెబుతున్నారు. ఈ ఫిన్ టెక్ స్టార్టప్కు 10 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
మొబిక్విక్ ఏమన్నదంటే
నోయిడాకు చెందిన ఈ ఫిన్టెక్ సంస్థ (మొబిక్విక్) డేటా లీకేజీ పైన స్పందించింది. సెక్యూరిటీ రీసెర్చర్లుగా చెప్పుకునే వారు కొందరు మీడియాతో కలిసి వండివార్చిన ప్రచారం విలువైన తమ కంపెనీ సమయాన్ని వృథా చేస్తోందని మొబిక్విక్ ప్రతినిధి తెలుపారు. తాము ఈ అంశంపై తీవ్రంగా దర్యాఫ్తు చేయగా, చివరకు ఏమీ లేదని తేలినట్లు వెల్లడించింది. తమ కస్టమర్ల డేటా, కంపెనీ డేటా పూర్తి సురక్షితంగా ఉందన్నారు.