30 నిమిషాల్లో రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి: మార్కెట్ క్రాష్ ఎందుకు?
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరగడం, దేశంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడం వంటి అంశాలు దలాల్ స్ట్రీట్ నష్టానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1300 పాయింట్ల వరకు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్లు మొదటి అరగంటలోనే రూ.5.27 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఓ సమయంలో 1400 పాయింట్లకు పైగా కూడా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది.
అందుకే నష్టాల్లోకి మార్కెట్లు
మధ్యాహ్నం గం.1.00 సమయానికి సెన్సెక్స్ 1050 పాయింట్లు నష్టపోయి 47,776 పాయింట్ల వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు క్షీణించి 14,308 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం వ్యాల్యూ రూ.74.65 వద్ద ట్రేడ్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు ప్రకటిస్తున్నాయి.
తాజాగా బీహార్, తమిళనాడు, రాజస్థాన్ కూడా రాత్రి కర్ఫ్యూ ప్రకటించాయి. అలాగే అనేక రాష్ట్రాలు వారాంతపు లాక్డౌన్లను ప్రకటించాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కరోనా వ్యాక్సీన్, రెమ్డెసివిర్ పరిమిత సరఫరా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వివిధ కారణాలతో సూచీలు నష్టపోయాయి.
ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు దెబ్బ
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశముందని ఆర్థిక నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని, అందుకే జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.55 శాతం, ఇన్ఫోసిస్ 1.11 శాతం, సిప్లా 1.05 శాతం, HCL టెక్ 0.58 శాతం, బ్రిటానియా 0.50 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 5.00 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.80 శాతం, అదానీ పోర్ట్స్ 4.64 శాతం, ఓఎన్జీసీ 4.66 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 4.21 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో విప్రో, టాటా మోటార్స్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.