coronavirus-oil: మార్కెట్లు విలవిల: బంగారమూ కారణమే.. భారీ నష్టాల వెనుక!
భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. సెన్సెక్స్ ఏకంగా 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు కోల్పోయింది. ఓ సమయంలో సెన్సెక్స్ 3,200కు సమీపంలో వచ్చింది. మార్కెట్ కుప్పకూలడానికి పలు కారణాలు ఉన్నాయి.
కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు విలవిల
WHO ప్రకటన
కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు రెండు నెలలుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇది వివిధ దేశాలకు విస్తరిస్తించినట్లుగా వార్తలు రాగానే మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా కేసులు తగ్గినప్పుటు మార్కెట్లు కోలుకుంటున్నాయి. అయితే బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో మార్కెట్లు ఈ రెండు నెలలకు మించి నష్టపోయాయి.
సప్లయి చైన్ తెగిపోయి...
కరోనా వైరస్ కారణంగా నాలుగున్నర వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. కేసులు పెరుగుతున్నాయి. వందకు పైగా దేశాల్లో ఇది విజృంభిస్తోంది. దీంతో చాలా దేశాలు స్వీయ నిర్బంధాలు విధిస్తున్నాయి. ప్రయాణ ఆంక్షలు పెరిగాయి. సప్లయి చైన్ దెబ్బతింటోంది. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై బాగానే పడింది.
క్రూడాయిల్ ప్రభావం
సౌదీ అరేబియా, రష్యా మధ్య చమురు యుద్ధం కొనసాగుతోంది. ప్రైస్ యుద్ధం నేపథ్యంలో సౌదీ ఆరాంకో ఉత్పత్తిని మరింత పెంచి, ధరలు తగ్గిస్తామని తెలిపింది. దీంతో చమురురంగ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి. ఓఎన్జీసీ 8 శాతం నష్టపోయింది. చమురు ధరలు తగ్గడమే కాదు, లాభాలు కూడా తగ్గుతున్నాయి. దీంతో కౌంటర్లలో అమ్మకాలకు దిగుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా మనపై ఉంది. కరోనా, చమురు ధరల యుద్ధం ప్రపంచ మార్కెట్లపై భారీగానే ఉంది. దీంతో అమెరికా డోజోన్స్ 6 శాతం వరకు, నాస్డాక్ 5 శాతం వరకు కోల్పోయింది. జపాన్ నిక్కి, సింగపూర్.. ఇలా అన్ని దేశాల షేర్లు నష్టపోతున్నాయి. ఇది భారత మార్కెట్ పైన ప్రభావం చూపింది.
రూపాయి
మార్కెట్లలో రూపాయి కూడా దిగజారింది. డాలరు మారకంతో ఉదయం 82 పైసలు కోల్పోయి 74.50 వద్ద ఉంది. వాణిజ్యం తగ్గి కరెన్సీ వ్యాల్యూ పడిపోతోంది. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది.
బంగారం
ఇన్వెస్టర్లు మార్కెట్లు కుప్పకూలినప్పుడు బంగారం, క్రూడాయిల్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. కానీ చమురు రంగం కూడా నష్టాలను ఎదుర్కొంటోంది. బంగారం అందనంత ఎత్తుకు పెరుగుతోంది. దీంతో వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడుతున్నారు. బంగారం ట్రేడర్లు లాభాలు స్వీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మరిన్ని కారణాలు..
కరోనా వైరస్ కారణంగా ప్రయాణాల రద్దు, ఫారన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ (FII) అమ్మకాలు పెరగడం, బాండ్ మార్కెట్లో అస్థిరత్వం, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం వంటి వివిధ కారణాలు భారత మార్కెట్లపై పడ్డాయి.