బ్యాంకులపై వినియోగదారులు భగ్గుమంటున్నారు.. ఎందుకో తెలుసా?
బ్యాంకుల ద్వారా ప్రతి రోజు కోట్లాది మంది అనేక రకాల లావాదేవీలను నిర్వహిస్తుంటారు. ఈ లావాదేవీల్లో కొంత మందికి ఇబ్బందులు కలుగుతుంటాయి. తమ లావాదేవీ విలువ చిన్నది అయితే కస్టమర్లు దాన్ని పరిష్కరించుకోవడానికి కొంత సమయం తీసుకున్నా ఓపికతో ఉంటారు. ఒకవేళ ఆ లావాదేవీ విలువ ఎక్కువ ఉండటమే కాకుండా ఇతర సేవల్లో ఇబ్బందికరంగా ఉంటే మాత్రం భగ్గుమంటున్నారు. వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు పరిష్కరించని పక్షంలో బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా గత ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులపై ఫిర్యాదులు భారీగానే పెరిగాయి.
ఏడాదిలో ఎంత పెరిగాయంటే..
భారత రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులపై ఫిర్యాదులు 20 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో వీటికి వచ్చిన ఫిర్యాదులు 32,311 పెరిగి 1,95,901కి చేరుకున్నాయి. క్రితం ఆర్ధిక సంవత్సరంలో ఫిర్యాదులు 1,63,590గా ఉన్నాయి. వీటిలో 72 శాతం ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ రూపంలోనే అందాయి. నేటి కాలంలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్లను వినియోస్తుండటం వల్ల చాలా సులభంగా ఫిర్యాదులు చేసే అవకాశం ఏర్పడుతోంది. ఆన్ లైన్ పోర్టల్, ఇమెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫిర్యాదులు 63.61 శాతంగా ఉన్నాయి. ఇక ఫిర్యాదుల పరిష్కారం విషయానికి వస్తే గత ఆర్ధిక సంవత్సరం (94.03) లో ఫిర్యాదుల పరిష్కార రేటు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం (96.46 శాతం) తో పోల్చితే తగ్గింది.
ఏటీఎం, డెబిట్ కార్డులపై
* ఏటీఎం, డెబిట్ కార్డులు నగదు ఉపసంహరించుకోవడానికి కాకుండా ఆన్ లైన్ లావాదేవీలకు కూడా వినియోగిస్తుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎం నుంచి నగదు రాకపోయినప్పటికీ ఖాతా నుంచి సొమ్ము మాత్రం తగ్గిపోతుంది. అయితే ఇలా జరిగినప్పుడు బ్యాంకుకు ఫిర్యాదు చేయడం వల్ల నగదు జమ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇక ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించినప్పుడు కూడా ఖాతా నుంచి నగదు డిడక్టు అయినా లావాదేవీ మాత్రం పూర్తి కాదు ఇలాంటి సందర్భంలోను కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
* గత ఆర్ధిక సంవత్సరంలో ఏటీఎం, డెబిట్ కార్డులకు సంబంధించి ఫిర్యాదులు 18.65 శాతానికి పెరిగాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఫిర్యాదులు 15 శాతంగా ఉన్నాయి.
* ఇదిలా ఉంటే తప్పుడు సమాచారంతో ఉత్పత్త్తుల అమ్మకాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. దీని వల్ల కొంత మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటికి సంబంధించి గత ఆర్ధిక సంవత్సరంలో ఫిర్యాదులు 1,115కు పెరిగాయి. ఫైనాన్సియల్ ఉత్పత్తుల మిస్ సెల్లింగ్ కు సంబంధించి బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఇవి మాత్రం తగ్గడం లేదు. 2017-18 సంవత్సరంలో మిస్ సెల్లింగ్ కు సంబంధించి 579 ఫిర్యాదులు వచ్చాయి.
బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ గురించి...
* బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ పథకాన్ని భారత రిజర్వ్ బ్యాంకు అమలు చేస్తోంది. బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించి కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఇది దోహద పడుతుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 కింద ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఇది 1995 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ పథకం 2006 కింద కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 2017 లో తాజాగా మరికొన్ని మార్పులు తీసుకువచ్చారు.
* కస్టమర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక సీనియర్ అధికారిని ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ గా నియమిస్తుంది. బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కార్యాలయాలు రాష్ట్రాల రాజధానుల్లో ఉంటాయి. దాదాపు 25 రకాల విభాగాల్లో సేవలకు సంబంధించిన ఫిర్యాదులను కస్టమర్లు అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు.