ఏం చేద్దాం.. ఏం చెబుదాం: త్వరలో భారత్లో క్రిప్టో కరెన్సీ లా?
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి ఎనలేని క్రేజ్ కనిపిస్తోంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు ఎత్తుపల్లాలు చూసినప్పటికి ఎక్కువమంది ఇన్వెస్టర్ల సంపదను సృష్టిస్తున్నాయి. షిబా ఇను వంటి క్రిప్టోలు అకస్మాత్తుగా వందలు, వేల రెట్లు జంప్ చేశాయి. క్రిప్టో వ్యాల్యూ, ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. క్రిప్టో కొనుగోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లే, భారత్లోను ఇందులో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
అయితే ప్రస్తుత క్రిప్టో ప్రమాణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రిప్టోపై పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు దేశంలో క్రిప్టో ప్రమాణాలపై చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన క్రిప్టో అంశంపై శనివారం చర్చ జరిగింది.
ఏం చేద్దాం.. ఏం చెబుదాం?
ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న వారు మన దేశంలో ఎక్కువగానే ఉన్నారు. దీంతో క్రిప్టో కరెన్సీపై ఎలా వ్యవహరించాలనే అంశంపై కేంద్రం దృష్టి సారించింది. దేశంలో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వేదికగా జరిగే ఈ వ్యవహరంలో ఎవరి జోక్యంలేని పరిస్థితి.
దీంతో క్రిప్టోలో పెట్టుబడులు మంచిది కాదనే ప్రచారం జరుగుతున్నప్పటికీ వ్యాప్తి ఆగడం లేదు. దీంతో క్రిప్టోలో పెట్టుబడులపై ప్రభుత్వపరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో పెట్టుబడి పెట్టే వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. క్రిప్టో పైన కేంద్రం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. గత కొంతకాలంగా క్రిప్టో స్కాంలు కూడా వెలుగు చూస్తున్నాయి.
బ్లాక్ చైన్ టెక్నాలజీ
క్రిప్టో కరెన్సీపై ప్రస్తుతం కేంద్ర బ్యాంకు లేదా ప్రభుత్వం నియంత్రణ లేదు. మార్కెట్ను కృత్రిమంగా ఎవరూ ప్రభావితం చేయడం లేదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడులకు రక్షణ లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్న క్రిప్టోకరెన్సీల ట్రాన్సాక్షన్స్ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తగు చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోందట.
వాటాదారులందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ విషయమై క్రిప్టో నిపుణులు, ఇతర వాటాదారులతో చర్చలు కొనసాగిస్తుందని, అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఉమ్మడి వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
పెద్దల పెట్టుబడి
చైనాతో పాటు పలు దేశాలు క్రిప్టో ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించడం లేదు. గతంలో సుప్రీం కోర్టు కూడా క్రిప్టోపై నిషేధం విధించింది. ప్రభుత్వాలు, ప్రమాణాల విషయాన్ని పక్కన పెడితే చాలామంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వంటి వారు కూడా ఇన్వెస్ట్ చేశారు.