కరోనా పుణ్యం... ముడి చమురు ధరలు దిగుతున్నాయ్
ముడి చమురు ధర పెరుగుతోందంటే భారత్ లాంటి దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు మొదలవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. సామాన్యులు హాహాకారాలు చేస్తారు. ప్రభుత్వం పై ప్రతిపక్షాలనుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అనేక ఉత్పత్తుల ధరలు పెరగడానికి ముడిచమురు ధరలు కారణమవుతాయి. దేశ ఆర్ధిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు దిగివస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కరోనా నే. దీని వల్ల అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి.
పెరగనున్న వేతనాలు.. చైనా కంటే ఎక్కువ, ఎంత శాతమంటే? ఈ రంగంలో 'డబుల్'!
ఏయే రంగాలకు మేలంటే?
మనదేశ ఇంధన అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశంలో ఇంధనాల వినియోగం పెరుగుతున్న కారణంగా ఎక్కువ విదేశి మారక నిల్వలు వెచ్చించి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకునే అనేక పరిణామాల ప్రభావం చమురు ధరలపై పడుతోంది. దీని వల్ల మనలాంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.అయితే ఇప్పుడు ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ కు 53 డాలర్ల స్థాయిలో ఉంది. ఈమేరకు మన దేశంలో ఇంధనాల ధర తగ్గుతుంది. ఫలితంగా ఇంధనాలు వినియోగించే అనేక రంగాలకు లబ్ది చేకూరుతుంది.
- ముఖ్యంగా విమానయాన రంగం, షిప్పింగ్, రోడ్డు రవాణా, రైలు రవాణా వంటి రంగాలకు తక్షణమే ప్రయోజనం చేకూరుతుంది. పలు దేశాల్లో కరోనా మూలంగా చమురును డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో ధరలు దిగివస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పలు పరిశ్రమలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. మనదేశం తక్కువ ధరల్లో ముడిచమురును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
- భారత్ ముడి చమురు దిగుమతిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉంది. అదే విధంగా ద్రవ సహజ వాయువు (ఎల్ ఎన్ జీ) దిగుమతిలో నాలుగో అతిపెద్ద దేశంగా ఉంది.
చైనాలో భారీగా తగ్గుదల
కరోనా విస్తృతి నేపథ్యంలో చైనాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల ముడిచమురు డిమాండ్ తగ్గిపోయింది. మొదటి త్రైమాసికంలో చైనాలో ముడి చమురు డిమాండ్ 15-20 మాత్రం తగ్గవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు డిమాండ్ తగ్గనుంది. ఫలితంగా ముడిచమురు, ఎల్ ఎన్ జీ ధరలు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గితే భారత్ పై కరెంట్ ఖాతా లోటు భారం తగ్గడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారత్ విదేశీ మారక నిల్వలు మిగలడమే కాకుండా ద్రవ్యోల్భణం కూడా అదుపులోకి వస్తుందని అంటున్నారు.
- ముడి చమురు ధరలు తగ్గితే విమానయాన రంగంతో పాటు పెయింట్స్, సిరామిక్, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలకు ప్రయోజనం కలగ నుంది. నిర్వహణా వ్యయాల్లో ఇంధనం వాటాయే అధికంగా ఉండే విమానయాన కంపెనీల లాభదాయకత పెరగనుంది. ఫలితంగా ఆయా కంపెనీలపై ఒత్తిడి తగ్గనుంది. విమాన టికెట్ల ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
ఒపెక్ దేశాలు ఏమి చేయవచ్చు
ముడిచమురు ధరల్లో తగ్గుదల వల్ల దీన్ని ఉత్పత్తి చేస్తున్న గల్ఫ్ దేశాలు ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒపెక్ లోని చాలా దేశాలు ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించే ఉద్దేశంతో ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఉత్పత్తిని తగ్గిస్తే ముడిచమురు ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల భారత్ కు మళ్ళి ధరల సెగ ఉండవచ్చు. అయితే ఇప్పటికయితే ధరల తగ్గుదల అనేది భారత్ కు వారమేనని అంటున్నారు. చమురు ధరల తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.