రైతులకు జగన్ ప్రభుత్వం 100% ఆఫర్! మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2019-20 ఏడాదికి కాను ప్రధానమంత్రి ఫసల్ బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీ నుంచి పంటల బీమాను 100% రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్చ్... ఆదాయం లేదు ఖర్చూ లేదూ! 6 నెలల్లోనే భారీగా మించిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు
100% బీమా ప్రీమియం
ఈ జీవో ప్రకారం ఏపీలోని నిర్దేశించిన ప్రాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుదారులందరికీ 100% బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిహారం సొమ్ము వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.
ఏపీ జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్
అంతేకాదు, పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే జీవో ఇచ్చింది. ఈ కార్పోరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా రూ.101 కోట్ల వాటా ధనంతో ప్రభుత్వ సొంత పంట బీమా సంస్థ ఏర్పడుతుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.
రైతులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
ఏపీ సాధారణ బీమా సంస్థకు సంబంధించి విధివిధానాలు కూడా విడుదలయ్యాయి. పంటల బీమా, పరిహారం చెల్లింపు అంశాలను ఈ సంస్థనే చెల్లిస్తుంది. పంటల బీమాకు సంబంధించి రైతులు ఏ ఏజెన్సీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పంట నష్టపోతే సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పరిహారం జమ చేస్తుంది. ఆధార్తో అనుసంధానమైన ఖాతాల్లోకి పరిహారం క్రెడిట్ అవుతుంది.
ఇది ఎలా...
- గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ఉమ్మడిగా పరిశీలించి సాగుదారుల వివరాలను గడువులోగా వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలి.
- పంట నష్టం, పరిహారం చెల్లింపు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల కింద ఇప్పటికే ఉన్న నియమ నిబంధనలను వర్తింపచేస్తారు.
- పంటల బీమా అమలు, పర్యవేక్షణ, పంట కోత ప్రయోగాలు, పరిహారం అందించడం వంటి అంశాలపై వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
- పంట నష్టపోతే అర్హులైన రైతులకు సాధ్యమైనంత త్వరగా న్యాయపరిహారం అందించాలి.
అందుకే సొంత బీమా సంస్థ..
రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది ఖరీఫ్లో ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో ఉచిత పంటల బీమాను అమలు చేయాలని ఇదివరకే నిర్ణయించింది. దీంతో రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను ప్రభుత్వమే బీమా సంస్థలకు చెల్లిస్తోంది. అయితే బీమా సంస్థల కంటే సొంతగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే రైతులకు వెనువెంటనే పరిహారం చెల్లించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రూ.101 కోట్లతో సొంత బీమా సంస్థను నెలకొల్పుతోంది. దీనిని రబీ నుంచి అమలులోకి తెస్తోంది.