రూ.1.13 లక్షల కోట్లకు చేరిన క్రెడిట్ కార్డు వినియోగం, భారీ వృద్ధి
క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డుదారులు ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు. అంతకుముందు నెలలో అంటే ఏప్రిల్ నెలలో ఈ ట్రాన్సాక్షన్స్ రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా చెబుతోంది కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డు కస్టమర్లు ఆన్ లైన్లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లను చెల్లించారు.
PoS మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా 11.5 కోట్లు, పీవోఎస్ మెషీన్ ఆఫ్ లైన్ ద్వారా 12.2 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు. ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ ద్వారా అధిక విలువైన చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డు కస్టమర్లు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం రూ.65,652 కోట్లను చెల్లించారు. పీవోఎస్ వద్ద రూ.39,806 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు.
క్రెడిట్ కార్డు వినియోగం మే నెలలో నెలవారీగా 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, వార్షిక ప్రాతిపదికన కార్డు ఖర్చులు 118 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో మే నెలలో 1.7 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ జోడించబడ్డాయి. గత ఇరవై ఏడు నెలల్లో ఇదే అత్యధికం. ఏడాది ప్రాతిపదికన 23.2 శాతం అధికం. దేశంలో కార్డ్ బేస్ ఇప్పుడు 76.9 మిలియన్లకు చేరుకుంది.