ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, ఉద్యోగాలు నిలబడాలంటే..: తీవ్ర సంక్షోభంలో రియాల్టీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో రియాల్టీ రంగంపై భారీ ప్రభావం పడింది. ప్రాజెక్టులు నిలిచిపోయాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు పలు పథకాలు ప్రకటించింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో హోమ్ సేల్స్ కాస్త పెరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం భారీగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో రియాల్టీ రంగాన్ని ఆదుకునేందుకు మరింత ప్రభుత్వ సహకారం అవసరమని కోరుతున్నాయి.
క్యాష్ వోచర్, రూ.10వేల అడ్వాన్స్: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి బంపర్ బొనాంజా
ప్రాజెక్టులు పూర్తి కావాలంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థిరాస్తి రంగం కష్టాల్లో కూరుకుపోయిందని, నగదు కొరత ఏర్పడి ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్-CREDAI) ఆందోళన వ్యక్తం చేసింది. నగదు కొరత వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి ఆర్థికంగా ప్రోత్సాహకం అవసరమని తెలిపింది. దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా బిల్డర్లు ఉన్న క్రెడాయ్ వడ్డీ మాఫీ రూపంలో ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కోరుతోంది.
మారటోరియం పొడిగింపు.. ఉద్యోగాలకు ముప్పు
రియల్టీ రంగానికి మారటోరియం కాలాన్ని 31 మార్చి 2021 వరకు పొడిగించాలని క్రెడాయ్ కోరుతోంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందకుంటే ఉద్యోగాలు మరిన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరాస్తి రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే చాలామంది డెవలపర్లు సరైన సమయానికి తమ ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు వాటిని అందించే పరిస్థితి ఉండదని పేర్కొంది. దీంతో ఎగవేతదారులు పెరిగే అవకాశాలు ఉంటాయని, భారీగా ఉద్యోగాల కోత ఉండవచ్చునని పేర్కొంది.
తీవ్ర సంక్షోభంలో..
రియాల్టీ రంగానికి ఆర్థిక సాయానికి సంబంధించి ఆలస్యం చేయవద్దని ఈ రంగం నిపుణులు కోరుతున్నారు. నిధుల లేమి సహా వివిధ సమస్యలతో తీవ్ర సంక్షోభం ఉన్న రియాల్టీ రంగానికి కొంత సహకారం అవసరమని చెబుతున్నారు. మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని ఇటీవల రియాల్టీ రంగం సుప్రీం కోర్టులోను పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం వడ్డీపై వడ్డీ ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.