కరోనా దెబ్బ: రియల్ ఎస్టేట్ ఢమాల్... 50% వరకు అమ్మకాలు డ్రాప్!
పుట్టుకతోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. ఇండియా కు కాస్త లేటుగా విస్తరించినా... గత రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ అమ్మకాలపై దీని ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి మన గడపకూ విచ్చేయటంతో మరో 3 నెలల పాటు ఈ రంగంలో పెద్దగా కార్యకలాపాలు ఉండే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూసుకున్నా అమ్మకాలు సుమారు 40% తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే 50% వరకు అమ్మకాలు క్షీణించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా మహా నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్లో డిమాండ్ తగ్గటంతో ఇప్పటికే ఉన్న సప్లై మిగిలిపోగా... కొత్త ప్రోజెక్టుల ప్రకటనలు వాయిదా పడే అవకాశాలే అధికం అని చెబుతున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా ఎవరూ ఎలాంటి కార్యకలాపాలు సాగించే వెసులుబాటు లేకపోవటంతో ఊహించనకంటే అధిక ప్రభావమే పడుతుందని వాపోతున్నారు.
వేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలు
గృహాల అమ్మకాలు 42% డౌన్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనారోక్ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2020 తోలి త్రైమాషికంలో కేవలం 7 ప్రధాన నగరాల్లోని అమ్మకాలను పరిశీలిస్తేనే గృహాల అమ్మకాలు 45,200 కు పడిపోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో అమ్మకాల సంఖ్య 78,510 కావటం గమనార్హం. దీంతో అమ్మకాల్లో మొత్తంగా 42% క్షీణత కనిపించింది. ఇదే సమయంలో కొత్త ప్రోజెక్టుల ప్రారంభం విషయంలోనూ తరుగుదల నమోదవుతోంది. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా కేవలం 41,200 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అదే 2019 లో ఐతే ఈ సంఖ్య 70,480 యూనిట్లు కావటం విశేషం. స్థూలంగా చూస్తే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో మొత్తంగా 6.65 లక్షల యూనిట్ల గృహాలను విక్రయించారు.
హైదరాబాద్ లో 50% తరుగుదల..
ఈ మధ్య కాలంలో దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరు కు గట్టి పోటీ ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. కానీ, కరోనా వైరస్ పుణ్యమా అని మన నగరంలోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితం అవుతోంది. 2020 జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2,680 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019 ఇదే సయమంలో వాటి విక్రయాలు 5,400 కావటం గమనార్హం. దీంతో భాగ్యనగరంలో రియల్ వృద్ధిలో 50% క్షీణత నమోదైనట్లు అనారోక్ వెల్లడించింది. మరో మూడు, నాలుగు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముంబై లో మరింత క్షీణత...
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ రియల్ ఎస్టేట్ కు స్వర్గధామం గా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ధరలు ఎంత అధికంగా ఉన్నప్పటికీ డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. కానీ, ప్రస్తుతం ముంబై సహా మహారాష్ట్ర మొత్తం దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ముంబై మహానగరంలో కొత్త యూనిట్ల ప్రారంభం ఘోరంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 26,850 యూనిట్ల గృహాలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం మాత్రం కేవలం 10,480 యూనిట్లకు పరిమితమైంది. దీంతో 61% క్షీణత నమోదైంది. ఇక్కడ 70% వరకు గృహాలు రూ 80 లక్షల విలువలో లభిస్తున్నాయి. మహారాష్ట్ర లోని మరో ప్రధాన నగరం పూణే లో కూడా పరిస్థితి దాదాపు ఇదే తీరులో ఉంది.